ఆసక్తికరంగా యూపీ పోరు-నేడు అఖిలేష్ అడ్డాలో బీజేపీ-యోగీ స్ధానంలో ఎస్పీ ప్రచారం మొదలు
వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీజేపీ, ఎస్పీ హోరాహోరీగా సన్నద్ధమవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ పోరుపై దేశంలోని రాజకీయ నేతల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పరస్పరం ప్రత్యర్ధుల సొంత స్ధానాల్లో ప్రచారానికి సిద్ధమయ్యారు.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంఘర్ లోక్ సభ స్ధానంలో బీజేపీ కీలక నేత అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ఇవాళ ప్రచారం ప్రారంభించబోతున్నారు. అలాగే యోగీ ఆదిత్యనాథ్ అడ్డా గోరఖ్ పూర్ లో ఎస్పీ అధినేత అఖిలేథ్ యాదవ్ తన మూడో విడత సమాజ్ వాదీ విజయ్ యాత్రను ప్రారంభించబోతున్నారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ఎస్పీకి పట్టు ఉన్న ఆజంఘర్ జిల్లాలో మాత్రం పదిసీట్లకు గానూ ఎస్పీ 5 సీట్లు, బీజేపీ నాలుగు సీట్లు సాధించాయి. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆజంఘర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదే జిల్లాల్లోని లాల్ గంజ్ లోనూ ఎస్పీ గెలిచింది. దీంతో ఆజంఘర్ పట్టు కోసం ఈసారి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.

అలాగే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ ఎంపీగా ఉన్న గోరఖ్ పూర్ పార్లమెంటు స్ధానం పరిధిలోని అసెంబ్లీ సీట్లను బీజేపీ గెల్చుకుంది. ఒకటి మాత్రం బీఎస్పీ ఖాతాలోకి వెళ్లింది. దీంతో ఈసారి గోరఖ్ పూర్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో సత్తా చాటుకునేందుకు ఎస్పీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అఖిలేష్ యాదవ్ తన సమాజ్ వాదీ విజయ్ యాత్రను మూడో దశ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు. ఇలా ప్రత్యర్ధుల కోటల్లో పాగా వేసేందుకు ఎస్పీ, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇద్దరికీ అదంత సులువుగా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications