తండ్రిలా అండగా నిలిచారు.. స్పూర్తినిచ్చినందుకు కృతజ్ఞతలు: మోడీ 'టచింగ్' లెటర్
మద్దతుగా నిలిచినందుకు, స్పూర్తినిచ్చినందుకు ప్రణబ్కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా తన చివరి రోజున ప్రధాని మోడీ నుంచి ఒక లేఖ అందుకున్నానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. మోడీ రాసిన లేఖను ట్విట్టర్ లో ఆయన షేర్ చేశారు. మూడేళ్ల కాలంలో ప్రణబ్ తనపై ఎంతో ప్రేమను, వాత్యల్యాన్ని చూపించారని మోడీ తన లేఖలో చెప్పారు.
'ప్రణబ్ దా.. మన రాజకీయ ప్రస్థానాలు విభిన్నమైన రాజకీయ నేపథ్యాల్లో రూపుదిద్దుకున్నాయి. అయినా మీ మేధోబలం, విజ్ఞత వల్ల మనం సమిష్టితత్వంతో కలిసి పనిచేయగలిగాం' అని అన్నారు.
మూడేళ్ల క్రితం ఒక బయటి వ్యక్తిగా తాను ఢిల్లీ వచ్చానని, ఆ సమయంలో తన ముందున్న కర్తవ్యంతో సవాళ్లతో కూడుకున్నదని, కానీ మీరిచ్చిన ప్రోత్బలం నాకు అండగా నిలిచిందని ప్రణబ్ ను ఉద్దేశించి మోడీ చెప్పుకొచ్చారు. ఒక తండ్రి లాగా, గురువు లాగా నాకు అండగా నిలిచారని అన్నారు.
'మీ మేదస్సు, వ్యక్తిగత అనుబంధం నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని ఇచ్చాయి. మీకున్న అపార జ్ఞానం, మేధో నైపుణ్యం ప్రభుత్వానికి ఎంతగానో తోడ్పడ్డాయి' అని లేఖలో వివరించారు. మద్దతుగా నిలిచినందుకు, స్పూర్తినిచ్చినందుకు ప్రణబ్కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.