యువతులకు, మహిళలకు మిస్డ్ కాల్స్ ఇస్తే అంతే
పాట్నా: యువతులు, మహిళలకు ఫోన్లు చేస్తూ, మిస్డ్ కాల్స్ ఇస్తూ వేధించే ఆకతాయిలకు కళ్లెం వేసేందుకు బీహార్ పోలీసులు కొత్త ఆలోచన చేశారు. మహిళలకు ఉద్దేశ్యపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తే వారిని అరెస్టు చేసి జైలుకు పంపించేందుకు బీహార్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ఉద్దేశ్యపూర్వకంగా మిస్డ్ కాల్స్ ఇస్తే జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని రాష్ట్ర సీఐడీ ఇన్స్పెక్టర్ జనరల్ అరవింద్ పాండే హెచ్చరించారు. ఈ మేరకు నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని బీహార్లోని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
పదేపదే మిస్డ్ కాల్స్ ఇవ్వడం వల్ల మహిళలు అభద్రతా భావానికి గురికావడంతో పాటు మనశ్సాంతిని కూడా కోల్పోతూ ఉంటారని, ఆ సమస్యను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పాండే చెప్పారు. పదేపదే మహిళలకు, యువతులకు మిస్డ్ కాల్స్ ఇవ్వడాన్ని సీరియస్గా పరిగణిస్తామన్నారు.
ఒకటి రెండుసార్లు వస్తే అది ఉద్దేశ్యపూర్వకంగా కాకపోవచ్చునని, కానీ పదేపదే ఇవ్వడం అంటే వేధించాలనే ఉద్దేశ్యంతోనే అని, దీని పైన తాము చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఇందుకోసం రెండు రోజుల పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.