మీరైతే ఏసీల్లో కూర్చోండి: కేజ్రీ ప్రభుత్వంపై సుప్రీం ఫైర్
ఢిల్లీ: మీరు ఏసీ చాంబర్లలో కూర్చోండి, మేం ఆదేశాలు ఇస్తాం.. అంటూ సుప్రీం కోర్టు ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పైన సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీకి నీటి సరఫరా పునరుద్ధరణ సమస్యను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించుకోకుండా కోర్టు మెట్లెక్కడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది.
ఢిల్లీ ప్రభుత్వ విజ్ఞప్తిపై అత్యవసరంగా స్పందించి దేశ రాజధాని నగరానికి నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు... హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు ధర్మాసనం తొలుత నిరాకరించింది.
ఈ సమస్యను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించుకోవాలని సూచించింది. 'మీరు ప్రభుత్వ స్థాయిలో సమస్యను పరిష్కరించుకోకుండా కోర్టుకు వచ్చారు. మీకు సుప్రీం నుంచి ఆదేశాలు కావాలి.. అన్నీ పళ్లెంలో పెట్టివ్వాలి. మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇక్కడ కోర్టుకు వచ్చి కూర్చున్నారు. మీరు ఏసీ చాంబర్లలో విశ్రాంతి తీసుకుంటూ కోర్టు ఆదేశాలను కోరుతున్నార'ని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఢిల్లీకి నీటి సరఫరా చేసేందుకు కేంద్రం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సెంటర్ (కేంద్రం) అని ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అంతకుముందు ఆయన మునాక్ కాల్వను పునరుద్ధరించాలని సోమవారం ఉదయం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
గడియారాన్ని వెనక్కి తిప్పగలం
అరుణాచల్ ప్రదేశ్లో కలిఖో పుల్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం అక్రమమని, దానిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు సోమవారం నాడు తోసిపుచ్చింది. ఒకవేళ అక్కడి గవర్నర్ చర్యలు రాజ్యాంగవిరుద్ధమని తేలితే 'గడియారాన్ని వెనక్కి కూడా తిప్పగలమ'ని స్పష్టం చేసింది.
రాజకీయ సంక్షోభంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో శుక్రవారం రాత్రి పుల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామాలను తాజాగా జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం దృష్టికి తీసుకొస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ఎఫ్ఎస్ నారిమన్ కోరారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మరీ ఎక్కువ అంశాలతో విషయాన్ని కలగాపులగం చేయవద్దని, ఎక్కువ అంశాలను జోడిస్తే వాటిని వర్గీకరించడం కష్టమవుతుందని, అవసరమైతే పరిస్థితిని సరిచేయగలమని మీకు తెలుసునని, ఎస్ఆర్ బొమ్మయ్ కేసులో తీర్పును చదవలేదా అని వ్యాఖ్యానించింది. జరిగిన నష్టాన్ని సరిదిద్దే అధికారాలు కోర్టుకున్నాయని తెలిపింది.