సెల్ఫోన్ పగలగొట్టిందని నాయనమ్మను చంపేశాడు
బెంగళూరు: నేటి తరం యువత వస్తువులపైనే అమితమైన ప్రేమను పెంచుకుంటోంది. దీంతో సొంత మనుషుల విలువ కూడా వారికి తెలియడం లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. తన కొత్త స్మార్ట్ఫోన్ను పగలగొట్టిందన్న కోపంతో.. 90 ఏళ్ల నాయనమ్మను ప్లాంకుతో కొట్టి చంపేశాడు ఆమె మనవడు.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కదిరెనహళ్లి ప్రాంతంలో ఉన్న తమ ఇంట్లో శివరాజ్ (22) అనే యువకుడు తన కొత్త స్మార్ట్ఫోన్ను చార్జింగ్లో పెట్టాడు. అతడి నాయనమ్మ లక్ష్మమ్మ (90)కు కంటిచూపు సరిగా లేదు. కాగా, ఆమె చూసుకోకుండా ఆ ఫోన్కు తగలడంతో అది కాస్తా కింద పడింది.
దీంతో ఆ ఫోను స్క్రీన్ పగిలిపోయింది. ఆ శబ్దం విన్న శివరాజ్ లోపలి నుంచి పరుగున అక్కడకు వచ్చాడు. వెంటనే కోపంతో చెక్క ప్లాంకు(పలక) తీసుకుని నాయనమ్మ మెడమీద కొట్టాడు. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో కుప్పకూలిపోయింది.
గమనించిన కుటుంబసభ్యులు శివరాజ్ను గట్టిగా మందలించారు. ఆ తర్వాత వెంటనే లక్ష్మమ్మను బెడ్రూంలోకి తీసుకెళ్లి, ఆమెను నెమ్మదిగా పడుకోబెట్టారు. మంగళవారం ఉదయం లక్ష్మమ్మను ఎంత లేపినా ఆమె లేవలేదు.
వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆమె మృతికి కారణమైన శివరాజ్ను అరెస్టు చేశారు.