సోదరిని వేధిస్తున్నాడని.. మామను కొట్టి చంపేశాడు
ముంబై: తన సోదరిని అత్తింటివారు పెడుతున్న వేధింపులు ఆ అన్నను ఆవేదనకు, ఆవేశానికి గురిచేశాయి. దీంతో తన సోదరిని వేధింపులకు గురిచేస్తున్న మామను కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
థానే జిల్లాలోని ముర్బాద్ తాలూకాలో దర్శంత్ ఠాకరే అనే 20ఏళ్ల యువకుడు తన సోదరిని అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారని.. వారిని నిలదీసేందుకు మరో ఇద్దరు కుటుంబసభ్యులతో కలిసి వారింటికి వెళ్లాడు.
కాగా, ఇక్కడ అత్తింటివారికి, ఆ యువకుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఘర్షణకు దిగారు. ఆగ్రహానికి గురైన దర్శంత్ తన సోదరి మామ దామూను కర్రతో బలంగా కొట్టాడు. దీంతో దామూ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు, నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు. దర్శంత్ను అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు ఉన్న మరో ఇద్దరు కుటుంబసభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దామూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.