తెలంగాణలో ఐదు సీట్లు గెలుస్తాం: జగన్ ధీమా
న్యూఢిల్లీ: తెలంగాణలోని 17 పార్లమెంటు సీట్లలో తమ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారికే తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
చరిత్రలో తొలిసారి విభజన బిల్లును శాసనసభ తిరస్కరించిందని ఆయన అన్నారు. విభజనను ఎదుర్కునేందుకు ప్రతిపక్షాలు కలిసి రావాలని ఆయన కోరారు. ఇది వరకే తాము వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని కోరామని ఆయన అన్నారు.

అపాయింట్మెంట్ తీసుకుని మరోసారి అందరినీ కలుస్తామని ఆయన చెప్పారు. బిల్లుపై కాంగ్రెసు ముందుకు వెళ్తే స్పీకర్ పోడియం వద్దే ఉండి అడ్డుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎవరు దీక్ష చేసినా తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని ఆయన చెప్పారు.
సమైక్య నినాదంతోనే తాను తెలంగాణలో త్వరలో పర్యటిస్తానని జగన్ చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్య నినాదం తీసుకోవడంతో జగన్ పార్టీ నుంచి పలువురు తెలంగాణ నాయకులు ఇప్పటికే వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications