జిందగీ నా మిలేగీ : ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా భారత రహస్యాలను పాక్కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్టు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ రహస్యాలు శతృ దేశం పాకిస్తాన్కు చేరవేస్తున్నారా..? ఈ రహస్యాలను చేరవేస్తున్నది భారతీయులేనా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. భారత ఆర్మీ రహస్యాలను శతృదేశాలకు వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ వర్గాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కనుగొన్నారు. మొహ్మద్ రషీద్ అనే వ్యక్తిని ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేశారు.
జిందగీ న మిలేగా అనే వాట్సాప్ గ్రూపు పేరుతో భారత రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నట్లు యాంటీ టెర్రర్ స్క్వాడ్ గుర్తించింది. ఇందులో రషీద్ కూడా సభ్యుడిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిందగీ న మిలేగా అనే ఈ వాట్సాప్ గ్రూప్ను పాకిస్తాన్ నుంచి నడుపుతున్నట్లు ఏటీఎస్ మరియు ఇంటెలిజెన్స్ అధికారులు నిర్థారించారు. అంతేకాదు ఈ గ్రూపులో మరో 56 మంది భారతీయులు సభ్యులుగా ఉన్నట్లు తెలిపారు. రషీద్కు భారీ మొత్తంలో డబ్బులు అందేవని వివరించారు. రషీద్ అరెస్టుతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏటీఎస్ అధికారులు తెలిపారు. అరెస్టు అయిన రషీద్ ఐఎస్ఐ ఏజెంట్ అని ఏటీఎస్ వెల్లడించింది.
ఇక సీఆర్పీఎఫ్, కాశీ విశ్వనాథ్ ఆలయం, గ్యాన్వాపీ మసీదు, సంకట్ మోచన్ ఆలయం, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, దశాశ్వమేధ్ ఘాట్, మాలవియా బ్రిడ్జ్, ఇతర ప్రధాన స్థలాల గురించి మొత్తం వివరాలు సేకరించి పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపునకు సమాచారం పంపతుతున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. రషీద్ నుంచి ఒక సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన ఏటీఎస్ ఏడీజీ ధృవ కాంత్ ఠాకూర్... దాన్ని పరిశీలించగా పాకిస్తాన్లోని ఐఎస్ఐతో సంభాషించేందుకు సిమ్ను వినియోగిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ వివరాలు ఇచ్చేందుకు రషీద్కు రూ.5వేలు చెల్లించేవారు.
ఇదిలా ఉంటే రషీదు చాటింగ్కు సంబంధించిన వివరాలను రికవర్ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు ఏటీఎస్ ఏడీజీ ధృవ కాంత్ ఠాకూర్ చెప్పారు. మొత్తం 56 మంది ఇందులో సభ్యులుగా ఉండగా ఉత్తర్ ప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. వీరి దగ్గరున్న ఫోన్ నెంబర్ను ఇతర రాష్ట్ర పోలీస్ శాఖలకు పంపామని వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని చెప్పిన ఏటీఎస్.. త్వరలో మరిన్ని విషయాలను రాబడుతామని చెప్పింది.