పదంటే 10నిమిషాలు.. పేకమేడల్లా కూలిన 19భవనాలు
భవనాలను కూల్చివేసిన స్థలంలో మూడున్నర బిలియన్లతో కొత్త ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టుగా చెప్పారు.
బీజింగ్: పన్నెండు అంతస్తుల భవనాల స్థానంలో మరింత ఎత్తయిన ఆకాశ హర్మ్యాలను నిర్మించాలన్న ఉద్దేశ్యంతో చైనాలో 19 భవన సముదాయాలను కూల్చేశారు. కేవలం పదంటే పది నిమిషాల్లో ఆ భవనాలన్ని పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
చైనాలోని హుబేయ్ ప్రావిన్స్లోని హాంకౌలో దాదాపు 15హెక్టార్ల స్థలంలో పన్నెండు అంతస్తులున్న 19భవన సమూదాయాలు ఉన్నాయి. ఇందులోని కొన్ని భవనాల్లో పన్నెండు అంతస్తుల కన్నా ఎక్కువే ఉన్నాయి. అదే స్థలంలో కొత్త ప్రాజెక్టును లాంచ్ చేస్తుండటంతో.. ఇప్పుడున్న భవనాలను కూల్చివేస్తున్నారు.
ఇలా ఇంతకుముందే 32భవనాలను నేలమట్టం చేశారు. తాజాగా 19భవనాలను కూల్చేశారు. దాదాపు ఐదు టన్నుల పేలుడు పదార్థాలను ఉపయోగించి ఈ భవనాలను నేలమట్టం చేశారు. భారీ భవనాలు ఒక్కసారిగా నేలకూలిపోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన దుమ్ము, ధూళి కమ్ముకుంది.
భవన సముదాయాలకు డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నా జియా యాంగ్ షెంగ్ దీనిపై స్పందించారు. భవనాలను కూల్చివేసిన స్థలంలో మూడున్నర బిలియన్లతో కొత్త ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టుగా చెప్పారు. కనీసం 707మీ. కన్నా ఎక్కువ ఎత్తు ఉండే ఆకాశ హర్మ్యాలను నిర్మించే పనిలో ఉన్నారు.
ప్రాజెక్టు పనులు ప్రారంభించే నాటికి ఆ ప్రదేశాన్నంతా ఖాళీగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో భవనాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల వల్ల స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని చెబుతున్నారు.