వైమానిక దాడి: 20మంది ఇండియన్స్ మృతి?
సనా: యెమెన్లో చమురు స్మగ్లర్లు, షియా ఉగ్రవాదులు లక్ష్యంగా సౌదీ అరేబియా మిత్రదేశాల కూటమి జరిపిన వైమానిక దాడిలో 20మంది భారతీయులు మృతి చెందినట్లు తెలిసింది. యెమెన్ పట్టణం అల్ హొదైదాహ్ ఓడరేవుపై మిత్రకూటమి విమానాలు మంగళవారం క్షిపణుల వర్షం కురిపించింది.
హొదైదాహ్ రేవు సమీపంలోని అల్ ఖోఖా ప్రాంతంలో జరిపిన దాడిలో భారతీయులు మరణించినట్లు స్థానికులు, మత్స్యకారులు తెలిపారు. ఈ దాడిలో రెండు పడవలు ధ్వంసమయ్యాయని, 12మంది షియా మిలిటెంట్లు కూడా చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.
మంగళవారం యెమెన్లో సౌదీ విమానాలు 20 చోట్ల వైమానికి దాడులు చేసినట్లు తిరుగుబాటు సంస్థ హుతీ పేర్కొంది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన వైమానిక దాడిలో 12 మంది పౌరులు చనిపోయినట్లు హుతీ మీడియా విభాగం ప్రకటించింది. సోమవారం కూడా వైమానిక దాడులు చేయటంతో 15 మంది చనిపోయారు.
కాగా, యెమెన్లో వైమానిక దాడిలో భారతీయులు మరణించినట్లు తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగశాఖ తెలిపింది. వాస్తవాలను తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
తిరుగుబాటుదారుల విజృంభణ తర్వాత యెమెన్లో గత ఏప్రిల్లో భారత్ తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. భారత ప్రభుత్వం అనేకమంది భారతీయులను తిరిగి ఇండియాకు రప్పించింది. కాగా, కొందరు భారతీయులు అక్కడే ఉంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. వైమానికి దాడిలో 20మందిలో 13మంది భారతీయులు సజీవంగా బయటపడ్డారు. కాగా, మరో ఏడుగురి ఆచూకీ మాత్రం తెలియరాలేదు.