బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టి 24 మంది దుర్మరణం
ఢాకా: వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి చెట్ల పోదల్లోకి దూసుకుని వెళ్లి పల్టీ కొట్టడంతో 24 మంది దుర్మరణం చెందిన సంఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. గురువారం వేకువ జామున 1.20 గంటల సమయంలో బారిసల్ - ఢాకా జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది.
సుమారు 50 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. మార్గం మద్యలో ఫరిద్ పూర్ జిల్లాలోని బంగా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న పోదలలోకి దూసుకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని జిల్లా సీనియర్ పోలీసు అధికారి బెలాల్ హాసన్ చెప్పారు.
బుధవారం రాత్రి బస్సు ఢాకా బయలుదేరింది. బస్సులో ఉన్న ప్రయాణికులలో చాల మంది ఢాకా వెళ్లవలసి ఉందని పోలీసులు చెప్పారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారని, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరణించాడని పోలీసు అధికారులు అన్నారు.
తీవ్రగాయాలైన 22 మందిని ఫరిద్ పూర్ లోని ఆసుపత్రులకు తరలించామని ఫైర్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ షంసుజ్జోవ్ అన్నారు. బంగ్లాదేశ్ లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడపడమే అందుకు కారణమని పోలీసు అధికారులు తెలిపారు.