26/11 ముంబై దాడులు: ఇటలీ నుండి నిధులు
న్యూఢిల్లీ: 26/11ముంబై దాడులకు వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీకి చెందిన హురియత్ కాన్ఫ్ రెన్స్ సభ్యుడు ఫిరదౌస్ అహమ్మద్ షాకు, దాడులు చేసిన వారికి ఆర్థిక సహాయం చేసిన వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
వెంటనే పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఆదేశాలు జారీ చేసింది. డెమెక్రాటిక్ పొలిటికల్ మూవ్ మెంట్ చైర్మన్ అయిన ఫిరదౌస్ మహమ్మద్ షా కు 2007 నుండి 2010 మధ్యలో ఇటలీ నుండి ఎంత నగదు చేరింది (మని ల్యాండరింగ్) అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు.
2007-2010 మద్యలో ఇటలీకి చెందిన మదీనా ట్రేడింగ్ కంపెనీ నుండి షా రూ. 3 కోట్లు పొందినట్లు కాశ్మీర్ లోయలో ఈడీ చార్జ్ షీటు దాఖలు చేసింది. షా ఈ నగదు ఏమి చేశాడు, ఎందుకు అతని అకౌంట్ కు నగదు బదిలి అయ్యింది అని పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారు.
పాక్ అక్రమిత కాశ్మీర్ లో నివాసం ఉంటున్న జావెద్ ఇక్బాల్ అనే వ్యక్తి పేరుతో ఇటలీ నుండి అనేక సార్లు ఈ నగదు షా అకౌంట్ కు బదిలి అయ్యిందని అధికారులు గుర్తించారు. అదే విధంగా షా అనుచరుల పేర్లతో ఉన్న బ్యాంకు అకౌంట్ లకు నగదు బదిలి అయ్యిందని వెలుగు చూసింది.
భారత్ సమాచారం ఇవ్వడంతో 2009లో ఇటలీ పోలీసులు ఇద్దరు పాకిస్థాన్ జాతీయులను అరెస్టు చేశారు. 300 సార్లు షా అకౌంట్ కు నగదు బదిలి అయ్యిందని ఎంట్రీలు అయ్యాయి. అన్నిసార్లు నగదు ఎందుకు డిపాజిట్ చేశారు, ఆ నగదు వీరు ఎవరికి అందించారు అని విచారణ చేస్తున్నారు.
అదే విధంగా 26/11 దాడులు జరిగే సమయంలో కూడ 8364307716-0 నెంబర్ కు వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రొటోకాల్ యాక్టీవేట్ కోసం 229 యుఎస్ డాలర్లు ఇటలీ లోని మదీనా ట్రేడింగ్ కంపెనీ ద్వారానే లావాదేవీలు జరిగాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది.