బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన పాక్: 100 మంది మృతి
దక్షిణ పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్ బాంబు మోతలతో దద్దరిల్లింది. సెహవాన్ లోని సూఫీల ప్రార్థనా మందిరం లాల్ షాబాజ్ కలందర్ లో గురువారం బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
సెహవాన్: దక్షిణ పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్ బాంబు మోతలతో దద్దరిల్లింది. సెహవాన్ పట్టణంలోని సూఫీల ప్రార్థనా మందిరం లాల్ షాబాజ్ కలందర్ లో గురువారం బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
ఈ దుర్ఘటనలో 100 మంది మృతి చెందగా, మరో వందమందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదరయ్యాయి. ప్రార్థనా మందిరం పరిసరాలు రక్తసిక్తమయ్యాయి. ఇది ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు.
భక్తులతో ప్రార్థనా మందిరం పరిసరాలు కిటకిటలాడుతున్న సమయంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. దీంతో భక్తులు భయకంపితులయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
పాకిస్తాన్ లో వారం రోజుల వ్యవధిలో ఇది అయిదో బాంబు పేలుడు. ఇప్పటి వరకు లాహోర్, మహ్మాండ్ ఏజెన్సీ, పెషావర్, క్వెట్టాలలో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం బాంబు పేలుడు జరిగిన సెహవాన్ లోని సూఫీ ప్రార్థనా మందిరం సమీపంలో ఆసుపత్రులు కూడా ఏమీ లేవు.
దీంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.