దొంగ వర్సిటీ: భారత విద్యార్థులపై అమెరికా చర్యలు
వాషింగ్టన్: అక్రమంగా తమ దేశంలో ఉండాలని చూస్తున్న 306 మంది భారత విద్యార్థులపై తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసింది. స్టూడెంట్ వీసాలపై వచ్చి అమెరికాలోనే స్థిరపడిపోవాలనే ఉద్దేశంతో ఒక అక్రమ సంస్థతో చేతులు కలిపిన భారతీయ విద్యార్థులపై తాము చర్యలు తీసుకుంటామని ఆ దేశ అధికారులు చెప్పారు.
306మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్రమాలకు పాల్పడ్డారని, వీరిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు. వీసా పొడగింపునకు అర్హత సాధించని.. 306మంది విద్యార్థులు నకిలీ విశ్వవిద్యాలయాల ద్వారా ప్రవేశాలు పొంది దేశంలో ఉండిపోవాలని చూస్తున్నారని ఇటీవల ఓ స్టింగ్ ఆపరేషన్లో తేలిన సంగతి తెలిసిందే.
కొందరు బ్రోకర్లు, అమెరికాకు చెందిన హోమ్ లాండ్ సెక్యూరిటీ సంస్థలోని ఇంకొందరు వ్యక్తులు కుమ్మక్కై 2013లో క్రాన్ ఫోర్డ్ లో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే పేరుతో బోగస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. స్థానికంగా విద్యాసంస్థలకు అనుమతినిచ్చే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ దీనికి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది.
కానీ, ఇది పైకి యూనివర్సిటీ భవనంలాగే కనిపించినా అక్కడ పాఠాలు లేవు.. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు. కేవలం హెచ్ 1 వీసాకు నిరాకరించబడిన వారిని చేర్చుకొని భారీ మొత్తంలో డబ్బులు దండుకునేందుకు స్థాపించబడిందే ఈ బోగస్ వర్సిటీ. ఈ విషయం స్టింగ్ ఆపరేషన్ ద్వారా తెలిసింది.
హోంల్యాండ్ సెక్యూరిటీ అండ్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్లో అక్రమంగా ఉంటున్న విద్యార్థుల వివరాలు బయటపడ్డాయి.
దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించిన 32 మంది మధ్యవర్తులను అరెస్టు చేశారు. ఇందులో 11 మంది భారత సంతతికి చెందినవారున్నారు. భారతీయ విద్యార్థులపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని అమెరికా వెల్లడించింది.
అయితే, వాస్తవానికి ఆ వర్సిటీ గురించి తెలియని విద్యార్థులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోమని కూడా టోనర్ చెప్పారు. ఒక అక్రమ సంస్థ ద్వారా ప్రవేశాలు పొంది శాశ్వతంగా ఉండిపోవాలని ప్రణాళిక రచించడం తప్పేనని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్లో భారత వైద్య విద్యార్థుల హత్య
ఉక్రెయిన్లో ముగ్గురు భారతీయ వైద్య విద్యార్థులపై కత్తులతో జరిగిన దాడిలో ఇద్దరు మృతిచెందారు. మరొక విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యారు. ముజఫర్నగర్కు చెందిన ప్రణవ్ శాండిల్య, ఘాజియాబాద్కు చెందిన అంకుర్సింగ్ కత్తిపోట్లతో మరణించారనీ, ఆగ్రాకు చెందిన ఇందర్జీత్సింగ్ చౌహాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.
చౌహాన్ తెలిపిన వివరాల మేరకు పోలీసులు కొంతమంది ఉక్రెయిన్వాసుల్ని పట్టుకున్నారని వెల్లడించారు. మన ఎంబసీ అధికారులతో సంప్రదిస్తోందనీ, కేసును పరిశీలిస్తోందన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాననీ, వారికి అన్నిరకాల సహాయం అందజేస్తామన్నారు.
భారతీయ విద్యార్థులకు చెందిన పాస్పోర్టులు, పత్రాలు, రక్తం మరకలు అంటిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. మృతదేహాల్ని భారత్ తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.