చైనా కేర్ హోమ్లో అగ్నిప్రమాదం: 38 మంది సజీవ దహనం
బీజింగ్: చైనాలోని కేర్ హోమ్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 38 మంది సజీవదహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో సోమవారం రాత్రి ఏడున్నర గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగినట్లు అధికార వర్గాలు చెప్పాయి. పింగ్ దింగ్ షాన్ అనే నగరంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భవనంలోని అపార్టుమెంట్లో కాంగ్లెయువాన్ అనే వృద్ధాశ్రమం ఉంది. ఇందులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించి మంటలు వ్యాపించాయి.
అగ్నిమాపక దళం చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించేసరికే దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. మిగతావారు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సంభవించిన ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు. చైనాలో పారిశ్రామిక ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం. ఇంతకు ముందు పలు అగ్నిప్రమాదాలు చైనాలో చోటు చేసుకున్నాయి.