ఈక్వెడార్ భూకంపం: 40 మందికి పైగా మృతి, సునామీ
క్వీటో: ఈక్వెడార్ రాజధాని క్వీటోలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 41 కి పెరిగినట్టు ఆ దేశ ఉపాధ్యక్షుడు జార్జ్ గ్లాస్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
భూకంపం కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, రహదారులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈక్విడార్లోని ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు జార్జ్ పేర్కొన్నారు. అంతేకాదు భూప్రకంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడి ప్రాంతీయ తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేశారు.
కాగా, స్థానిక కాలమానం ప్రకారం శనివారం 11.58 గంటల ప్రాంతంలో భూకపం కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో బలమైన భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు అమెరికా జీయోలాజికల్ సర్వే వెల్లడించింది.
11 నిమిషాల కాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు కుదిపేసినట్టు యూస్జీయస్ వెల్లడించింది. తొలుత భూకంప తీవ్రత 4.8 గానూ, రెండో భూకంప తీవ్రత 7.8 గా నమోదైనట్టు తెలిపింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండటంతో మరణించిన వారి సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, జపాన్లో రెండు రోజుల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు అక్కడ తీవ్ర నష్టాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప ధాటికి మృతుల సంఖ్య 41కు పెరిగగా, 1500 మంది గాయపడ్డారు. ఇప్పటికీ అనేక మంది శిధిలాల కింద చిక్కుకుపోయారని భావిస్తున్నారు.
టొకాయ్ విశ్వవిద్యాలయంలోని వసతి గృహం కూడా ధ్వంసమైంది. ఇందులో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ప్రకంపనల తాకిడికి భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు, రోడ్లు, రైల్వే లైన్లు మట్టి దిబ్బల కింద కూరుకుపోయాయి. అనేక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.