హరికేన్ బాధితులకు అమెరికా మాజీ అధ్యక్షుల ఆపన్న హస్తం.. ఐదుగురు ఒకే వేదికపైకి వచ్చి..
అమెరికా మాజీ అధ్యక్షుడు ఐదుగురు పార్టీకతీతంగా ఒక్కటయ్యారు. హరికేన్ బాధితుల సహాయార్థం నిర్వహించిన సంగీత విభావరిలో పాల్గొని, విరాళాలు అందించి తమ సహృదయతను చాటుకున్నారు.
ఆస్టిన్: అమెరికా మాజీ అధ్యక్షుడు ఐదుగురు పార్టీకతీతంగా ఒక్కటయ్యారు. హరికేన్ బాధితుల సహాయార్థం విరాళాలు అందించి తమ సహృదయతను చాటుకున్నారు. టెక్సాస్, ఫ్లోరిడా, లూసియానా, ప్యూర్టారికో, యూఎస్ వర్జన్ ఐలాండ్స్ పై హరికేన్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
ఈ హరికేన్ల కారణంగా ఆయా ప్రాంతాల్లో నష్టపోయిన బాధితుల కోసం విరాళాలు సేకరించారు. టెక్సాస్ లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన కాలేజి స్టేషన్ లో ఒక సంగీత విభావరి నిర్వహించారు.
అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్, జార్జి హెచ్ బుష్, జార్జి డబ్ల్యూ బుష్ లు ఈ సంగీత విభావరి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.
93 ఏళ్ల వయసులో.. పార్కన్సన్ వ్యాధితో బాధపడుతూ.. కుర్చీలోంచి లేవలేని స్థితిలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్ సైతం ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
హరికేన్ బాధితుల సహాయార్థం సెప్టెంబరు 7 నుంచి విరాళాల సేకరణ మొదలుపెట్టగా, ఇప్పటివరకు దాదాపు రూ.200 కోట్లు వచ్చినట్లు జార్జి హెచ్డబ్ల్యూ బుష్ ప్రతినిధి జిమ్ మెక్గ్రాత్ వెల్లడించారు.