హైతీలో పేలిన గ్యాస్ ట్యాంకర్: 50 మందికి పైగా మృతి.. 20 ఇళ్లకు వ్యాపించిన మంటలు..
హైతీలో గ్యాస్ ట్యాంకర్ పేలుడు సంభవించింది. హైతియన్ సిటీలో గల కాప్ హైతియన్లో మంగళవారం ఉదయం ఘటన జరిగింది. కొందరు దుండగులు గ్యాస్ తస్కరించి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంతో 50 నుంచి 54 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్ పాత్రిక్ ఆల్మొనార్ ఏఎఫ్పీ వార్తాసంస్థకు తెలియజేశారు. ఇటు పలువురు తీవ్రంగా గాయపడ్డారని డిప్యూటీ మేయర్ వెల్లడించారు.
ప్రమాదంతో ఘటనాస్థలానికి దగ్గరలో ఉన్న 20 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. అయితే ఆ సమయంలో ఎంత మంది ఇళ్లలో ఉన్నారనే అంశంపై స్పష్టత లేదు. కానీ ప్రమాద తీవ్రత దృష్ట్యా ఆందోళన కలిగిస్తోంది. ఉదయం వేళ కాబట్టి అందరూ ఇళ్లలోనే ఉంటారు. ఇటు హైతీలో గ్యాస్ లైన్ల నుంచి కొన్ని ముఠాలు గ్యాస్ దొంగతనం చేస్తుంటాయి. దీంతో అక్కడ తీవ్ర గ్యాస్ కొరత ఉంది. ఇలా దుండగులు గ్యాస్ దోచుకెళుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ ఏకంగా ట్యాంకర్ పేలి.. అక్కడ ఉన్న వారిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.
క్షతగాత్రులను సమీపంలోని జస్టినియన్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి బాధితులతో కిక్కిరిసిపోయింది. తీవ్రంగా కాలిపోయిన వ్యక్తులు అధిక సంఖ్యలో చేరడంతో వారికి చికిత్స అందించే సామర్థ్యం తమకు లేదని ఆస్పత్రిలోని నర్సు చెప్పినట్టు అధికారి పేర్కొన్నారు. వారందరినీ రక్షించలేమని భయంగా అనిపిస్తుందని ఆమె చెప్పినట్టు నివేదిక తెలిపింది. గ్యాస్ పేలుడు ఘటనలో గాయపడ్డవారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొన్నిరోజులుగా హైతీలో ముఠాలు గ్యాస్లైన్లను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతోందని స్థానికులు అంటున్నారు.