53 మంది భారత మత్స్యకారులను విడిచిపెట్టిన శ్రీలంక.. ఇంకా 32 మంది వారి ఆధీనంలోనే
శ్రీలంక జైలులో బందీలుగా ఉన్న 53 మంది భారత మత్స్యకారులను సౌహార్ద్ర చర్య కింద ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మరో 32 మంది మత్స్యకారులు ఇంకా వారి అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
కొలంబో: శ్రీలంక జైలులో బందీలుగా ఉన్న 53 మంది భారత మత్స్యకారులను సౌహార్ద్ర చర్య కింద ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మార్చి 6న లంక నావికాదళం కాల్పుల్లో తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన భారత మత్స్యకారుడు(22) ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ఈ ఘటనలో మరో మత్స్యకారుడు కూడా గాయపడ్డాడు. శ్రీలంక నావికదళ సిబ్బంది చర్యను నిరసిస్తూ తమిళనాడు ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య వాతావరణం వేడెక్కకముందే ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు జరిపి నిన్ననే ఒక అవగాహన ఒప్పందానికి వచ్చారు.
ఈ ఒప్పందం మేరకు ఇరు దేశాల నిర్బంధంలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్-శ్రీలంక నిర్ణయించాయి. ఇందులో భాగంగా శుక్రవారం 53 మంది భారత మత్స్యకారులను జాఫ్నా జైలు నుంచి విడుదల చేసినట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. అతి త్వరలోనే వీరు భారత్ కు చేరుకోనున్నారు.
మరో 32 మంది మత్స్యకారులు వువునియా జైలులో ఉన్నట్లు తెలుస్తోంది. తమ అదుపులో ఉన్న మొత్తం 85 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్నట్లు కొలంబోలోని భారత హైకమిషన్ కు శ్రీలంక సమాచారం ఇచ్చిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు.