పశుపతి ఆలయ ఘాట్స్లో 533 మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు
న్యూఢిల్లీ: నేపాల్లో సంభవించిన భారీ భూకంపంలో వెలికితీసిన 530 మృతదేహాలకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. భూకంపంలో శిధిలాలకింద చిక్కుకున్న 533 మృతదేహాలను వెలికితీసినట్టు పేర్కొన్న అధికారులు, అందులో 530 మృతదేహాలకు పశుపతి ఆలయ సమీపంలోని ఘాట్స్లో అంత్యక్రియలు నిర్వహించారు.
అంత్యక్రియలు జరిపిన మృతదేహాల్లో 9 మంది చిన్నారులున్నట్టు అంత్యక్రియల నిర్వహణ కేంద్రం అధికారి రితేశ్కుమార్ వెల్లడించారు. మరో 152 మృతదేహాలకు పవిత్ర పుణ్యక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించామన్నారు.
ఏప్రిల్ 25న 7.9 తీవ్రతతో సంభవించిన భూకంప తాకిడికి నేపాల్లో రాజధాని ఖాఠ్మండు నేలమట్టమైన సంగతి తెలిసిందే. గత 80 సంవత్సరాల్లో ఇలాంటి భూకంపాన్ని చూడని ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇప్పటి వరకు ఏడు వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్ భూకంప ప్రభావం సుమారు 80 లక్షల మందిపై పడింది. నేపాల్ రాజధాని ఖాఠ్మండులో సుమారు లక్షా అరవై వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపం జరిగి తొమ్మిది రోజులైనా నేపాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రధాని సుశీల్ కొయిరాలా సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. శిథిలాల తొలగింపు పూర్తయ్యేటప్పటికి మృతుల సంఖ్య పదిహేను వేలకు చేరే అవకాశముందని అన్నారు. సోమవారం మరో ఏడుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది.
సహాయ బృందాలు సోమవారం శిథిలాల కింది నుంచి మరికొంతమంది మృతదేహాలను బయటికి తీయగా.. మొత్తం మృతుల సంఖ్య ఇప్పటికి 7,365కు చేరుకుంది. నేపాల్కు ప్రధాన ఆర్థిక వనరు అయిన పర్యాటక రంగాన్నీ భూకంపం తీవ్రంగా దెబ్బతీసింది. రూ.10 వేల కోట్ల నష్టాన్ని చవిచూసిన నేపాల్.. రాబోయే రోజుల్లో పర్యాటకులను అనుమతించలేని పరిస్థితులు నెలకొన్నాయి.