ఫ్లాష్బ్యాక్ 2017: ప్రపంచాన్ని గడగడలాడించిన ఆరు సైబర్ దాడులు!
వాషింగ్టన్: డిజిటల్ ప్రపంచాన్ని గడగడలాడించిన ఆరు సైబర్ దాడాలకు 2017 వేదికగా నిలిచింది. వైరస్లు, సైబర్ అటాక్లు కొత్త కాకపోయినా.. ఈ ఏడాది జరిగిన సైబర్ దాడులు మాత్రం ప్రపంచంలోని చాలా దేశాలకు కంటికి కునుకు లేకుండా చేశాయి.
ఒక్క ర్యాన్సమ్వేర్ అటాక్స్ వల్ల కలిగిన నష్టమే రూ.32 వేల కోట్లకుపైగా ఉంది. ఏళ్లు గడిచేకొద్దీ వీటి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో 2017లో ప్రపంచాన్ని వణికించిన ఆరు క్రూరమైన సైబర్ అటాక్స్ ఏమిటో ఓసారి చూద్దాం..
షాడో బ్రోకర్స్ అటాక్...
అమెరికా భద్రతా సంస్థ ఎన్ఎస్ఏ ‘ఎటర్నల్ బ్లూ' పేరుతో ఒక హ్యాకింగ్ టూల్ను తయారు చేయగా దాన్ని షాడో బ్రోకర్స్ అనే సైబర్ గ్యాంగ్ తస్కరించింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగించుకుని ఈ హ్యాకింగ్ టూల్ ద్వారా ఏ కంప్యూటర్నైనా హ్యాక్ చేయొచ్చు. అలాంటి హ్యాకింగ్ టూల్ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చోరీ చేసిన షాడో బ్రోకర్స్ గ్యాంగ్ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లపై వదిలింది. దీంతో కంప్యూటర్ సిస్టంలన్నీ కరప్ట్ అయ్యాయి. ఈ షాడో బ్రోకర్స్ అనేది ఓ రహస్య సంస్థ. వీళ్ల ఆచూకీ ఎక్కడా లభించదు. ఈ గ్యాంగ్కు రష్యాతో సంబంధాలున్నట్లు, సిరియాపై అమెరికా బాంబు దాడి జరిపినందుకే వీళ్లు ఈ పనికి పాల్పడినట్లు సమాచారం.
ఈక్విఫ్యాక్స్ అటాక్...
అమెరికాలో అతిపెద్ద క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీలో ఒకటి ఈక్విఫాక్స్. ఈ ఏడాది జూలైలో ఈ క్రెడిట్ ఏజెన్సీపై హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. 145 మిలియన్ ప్రజల వ్యక్తిగత డేటాను వీరు దొంగతనం చేశారు. అత్యంత కీలకమైన సమాచారం ( క్రెడిట్ కార్డు నెంబర్లు, బర్త్డే వివరాలు, సోషల్ సెక్యురిటీ నెంబర్లు ) హ్యాకర్లు దొంగలించారు.
ది హెచ్బీఓ హ్యాక్...
దశాబ్దం కాలంగా సంచలనం సృష్టిస్తోన్న అత్యంత పాపులర్ టెలివిజన్ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్'పై కూడా హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఈ షోకు చెందిన స్క్రిప్ట్లు, 1.5 టెరాబైట్స్ డేటాను ‘మిస్టర్ స్మిత్' అనే హ్యాకింగ్ గ్రూప్ చోరీ చేసింది. అనంతరం హ్యాకర్లు హెచ్బీఓ నుంచి 6 మిలియన్ డాలర్లకుపైగా చెల్లించాలని కోరారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే చోరీ చేసిన ఫైల్స్ను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. అయితే హ్యాకర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని హెచ్బీఓ చెల్లించిందో లేదో మాత్రం తెలియదు. ఈ విషయాన్ని ఆ సంస్థ రహస్యంగా ఉంచింది.
నాట్పెట్యా మాల్వేర్ అటాక్...
ఈ ఏడాది ప్రపంచాన్ని కుదిపేసిన మాల్వేర్లలో నాట్పెట్యా ఒకటి. గత ఏడాది ర్యాన్సమ్వేర్ పెట్యాకు దీనికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ నాట్పెట్యా మాల్వేర్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంప్యూటర్లకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాలు దీని బారిన ఎక్కువగా పడ్డాయని సైబర్ సెక్యురిటీ సంస్థ సిమాంటెక్ పేర్కొంది. నాట్పెట్యాతో ఆసియా-పసిఫిక్లో ఎక్కువగా ప్రభావితమైనది భారత్ మాత్రమే. అమెరికాలోని కార్పొరేట్ దిగ్గజాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీ మెర్క్, డానిష్ షిప్పింగ్ కంపెనీ, రష్యన్ ఆయిల్ దిగ్గజం రోస్నేఫ్ట్ వంటివి దీని బారిన పడ్డాయి. ఉక్రేయిన్లో పవర్ కంపెనీలను, ఎయిర్పోర్టులను, పబ్లిక్ ట్రాన్సిస్ట్ను, ఈ దేశ సెంట్రల్ బ్యాంకును నాట్పెట్యా గడగడలాడించింది.
జోమాటో హ్యాక్...
భారత్లోని అతిపెద్ద రెస్టారెంట్ అగ్రిగేటర్లలో ఒకటైన ‘జోమాటో' కూడా భారీ హ్యాకింగ్కు గురైంది. ఈ సంస్థకు చెందిన 1.70 కోట్లకుపైగా యూజర్ల అకౌంట్ల సమాచారాన్ని హ్యాకర్లు కొల్లగొట్టి డార్క్ వెబ్లో విక్రయించారు. ఈ డేటా బేస్లో రిజిస్టర్డ్ జోమాటో యూజర్ల ఈ-మెయిల్స్, పాస్వర్డ్ లు ఉన్నాయి. అదృష్టశాత్తు యూజర్ల పేమెంట్ వివరాలు మరోచోట నిక్షిప్తం చేయడంతో జోమాటో యూజర్లు ఆర్థిక నష్టం బారిన పడలేదు.
వాన్నాక్రై మాల్వేర్ అటాక్...
ప్రపంచాన్ని వణికించిన ర్యాన్సమ్వేర్ దాడుల్లో ‘వాన్నాక్రై' మాల్వేర్ అటాక్ ఒకటి. భారత్ సహా 100 దేశాల్లోని కంప్యూటర్లలోని డేటాను ఎన్క్రిప్ట్ చేసి.. డబ్బు చెల్లిస్తేగాని తిరిగి కంప్యూటర్లను విడిచిపెట్టబోమంటూ హెచ్చరించింది. 24 గంటల్లో లక్షకుపైగా కంప్యూటర్లు ఈ వాన్నాక్రై అటాక్ బారినపడ్డాయి. 100కుపైగా దేశాల్లోని ఆసుపత్రులు, పోలీసు శాఖలు, ప్రజా రవాణా వ్యవస్థలు, టెలికం సంస్థలు, కంపెనీలు, యూనివర్సిటీలపై దీని ప్రభావం పడింది. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన ఈ తరహా దాడుల్లో ఇదే అదిపెద్దదని నిపుణులు పేర్కొన్నారు. వాన్నాక్రై అటాక్ కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి చెందిన 102 కంప్యూటర్లు కూడా ప్రభావితమయ్యాయి.