మళ్లీ పేలిన గన్: గంటల వ్యవధిలో పలుచోట్ల యథేచ్ఛగా కాల్పులు: ఆరుమంది మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్కు బ్రేకులు పడట్లేదు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ.. వరుస ఘటనలు చోటు చేసుకుంటూనే వస్తోన్నాయి. ఇదివరకు టెక్సాస్, ఓక్లహామా సహా పలుచోట్ల విచ్చలవిడిగా కాల్పులు సంభవించాయి. ప్రత్యేకించి- టెక్సాస్లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో కాల్పుల తరువాత.. తరచూ అలాంటి ఘటనలు సంభవిస్తోన్నాయి. పదుల సంఖ్య ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు.
ఇప్పుడు తాజాగా చికాగోలో కాల్పుల ఉదంతం సంభవించింది. వీకెండ్ సందర్భంగా నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. యథేచ్ఛగా తుపాకులు పేలాయి. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే పలు ఈ దిగ్భ్రాంతికర సంఘటనలు సంభవించడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
తొలుత- తెల్లవారు జామున అర్ధరాత్రి 12:20 నిమిషాల సమయంలో సౌత్ అల్బనీలో తొలి కాల్పుల ఉదంతం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించింది. అనంతరం 2:30 గంటల సమయంలో సౌత్ ఇండియానాలో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడివున్న అతన్ని గుర్తించిన వెంటనే పోలీసులు యూనివర్శిటీ ఆఫ్ చికాగో మెడికల్ సెంటర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
సౌత్ జస్టిస్, సౌత్ డమెన్.. ప్రాంతాల్లోనూ కాల్పులు సంభవించినట్లు చికాగో పోలీస్ అధికారులు తెలిపారు. నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను మోహరింపజేసినట్లు చెప్పారు. నల్లరంగు సెడాన్ కారులో నిందితులు ప్రయాణించినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఈ కాల్పులన్నీ ఒకే గ్యాంగ్కు చెందిన సభ్యులు చేశారా? లేక వేర్వేరు ఘటనలా? అనే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని వివరించారు.