అతని ప్రయోగం సక్సెస్..! ఇక ఆలుగడ్డలతోను విద్యుత్
నైజీరియా : అంధకారం నుంచే వెలుగునిచ్చే ఆలోచనేదో పుట్టుకొస్తుంది. సరిగ్గా ఇదే తరహాలో తమకున్న విద్యుత్ లేమి ప్రతికూలతలను అధిగమించడానికి, తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెట్టాడు నైజీరియాకు చెందిన అలబి ఒలుసోలా అనే యువకుడు. ఆచరణలో పెట్టమే కాదు తన ప్రయోగం విజయవంతమవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడతని ప్రయోగం ఓ హాట్ టాపిక్ గా మారింది.
నైజీరియాలో సాధారణంగానే విద్యుత్ సమస్య చాలా ఎక్కువ. దీంతో అక్కడి కుటుంబాలను ఏళ్లుగా విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా పూర్తి స్థాయిలో విద్యుత్ అవసరాలను తీర్చలేకపోతున్నారు. అయితే ఈ విద్యుత్ కష్టాల నుంచి తమ కుటుంబాన్ని గట్టెక్కించాలనుకున్న అలబీ ఒలుసా అనే నైజీరియన్, ఆలుగడ్డలతో విద్యుత్ తయారుచేసి అబ్బురపరుస్తున్నాడు.
తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాపర్, జింక్ ఎలక్ట్రోడ్స్ ద్వారా ఆలుగడ్డల నుంచి విద్యుత్ జెనరేట్ అయ్యేలా ఆ నైజీరియన్ యువకుడు తన ప్రయోగాలు సాగించి సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతని ప్రయోగం సక్సెస్ అవడంతో తన ఇంటి అవసరాల కోసం ఆలుగడ్డల విద్యుత్ నే ఉపయోగిస్తున్నట్టు సమాచారం.