దేశాధ్యక్షుడి నివాసాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులు.. కాల్పులు: లంకలో ఏం జరుగుతోంది?
కొలంబో: శ్రీలంకలో నెలకొన్న పెను ఆర్థిక సంక్షోభ పరిస్థితులు.. ఆ దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఆందోళనలకు దారి తీస్తోన్నాయి. తీవ్ర అనిశ్చితి నెలకొందక్కడ. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరల దెబ్బకు సామాన్యులు జీవించలేని దుర్భర వాతావరణం నెలకొంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే.. శ్రీలంక కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుకోవడం నిత్యకృత్యమైంది. కుప్పకూలిన ఆర్థిక స్థితిగతులను పునరుద్ధరించడంలో విఫలమైందక్కడి ప్రభుత్వం.

లంకేయుల్లో అసహనం..
రోజులు గడుస్తున్నా.. దాన్ని సరిదిద్దలేకపోతోంది. రోజూ సమీక్షలు నిర్వహిస్తోంది. ధరల పెరుగుదలను నియంత్రించడానికి తక్షణ చర్యలను తీసుకుంటోన్నప్పటికీ.. అవి చాలట్లేదు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం కావడంతో లంకేయులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆందోళనలకు దిగుతున్నారు. నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. ప్రభుత్వాధినేతల రాజీనామాల కోసం పట్టుబడుతున్నారు. దీనితో శ్రీలంకలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి.

దేశాధ్యక్షుడి నివాసంపై దాడి..
ఈ పరిణామాల మధ్య లంకేయులు- తమ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంపై దాడికి దిగారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆయన నివాసంపై దండెత్తారు. తన అధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేయాలంటూ నినదించారు. రాజధాని కొలంబో శివార్లలోని మిరిహన రెసిడెన్షియల్ క్వార్టర్ పరిధిలో ఉంటుందీ ఆయన ప్రైవేట్ బంగళా. దీన్ని వందలాది మంది ఆందోళనకారులు చుట్టుముట్టారు. భద్రత సిబ్బందిపై రాళ్ల వర్షాన్ని కురిపించారు. పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు.

ఆందోళనకారులపై కాల్పులు..
గొటబయ రాజపక్స నివాసం ప్రహరీగోడలను దాటుకుని లోనికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి భద్రత సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రత సిబ్బంది వారిపై రబ్బర్ బులెట్లతో కాల్పులు జరిపి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కాల్పులతో ఆందోళనకారులు వారు మరింత రెచ్చిపోయారు. రాళ్లు, ఇటుకలతో భద్రతసిబ్బందిపై దాడి చేశారు. ఆ సమయంలో రాజపక్స తన నివాసంలో లేరు.

కొలంబోలో కర్ఫ్యూ..
ఉ్రదిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు కొలంబోలో కర్ఫ్యూను విధించారు. గుంపులు గుంపులుగా కనిపించిన ప్రదర్శనకారులను చెదరికొట్టడానికి టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించినట్లు కొలంబో సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అమల్ ఎదిరిమన్నె తెలిపారు. ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్స సహా మంత్రుల నివాసానికి కట్టుదిట్టుమైన భద్రత కల్పించామని చెప్పారు.

ఐఎంఎఫ్ లోన్..
ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు సాగిస్తోంది. పెద్ద ఎత్తున రుణాన్ని తీసుకోవడానికి సమాయాత్తమౌతోంది. ఈ మేరకు ఐఎంఎఫ్ ప్రతినిధులతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలను నిర్వహించింది. తాము చేసిన ప్రతిపాదనలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇచ్చిన సూచనల పట్ల ఐఎంఎఫ్ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారని, త్వరలోనే రుణం అందుతుందని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications