విమానంలో పాము - ప్రయాణికుల్లో కలకలం: గంటల కొద్దీ జాప్యం
విమానంలో పాము - ప్రయాణికుల్లో కలకలం: గంటల కొద్దీ జాప్యం
దుబాయ్: విమానంలో పాము కనిపించిన ఘటన కలకలం రేపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధపడిన సమయంలో పాము కనిపించడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురయ్యారు. దీనితో విమానం ప్రయాణంలో ఏడు గంటల పాటు జాప్యం ఏర్పడింది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది.
కేరళలోని కాలికట్ నుంచి బయలుదేరిన బీ737-800 విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. లగేజీని తరలించడానికి సిబ్బంది విమానం కార్గో హోల్డ్కు వెళ్లిన తరువాత అందులో పాము కనిపించింది. దీనితో సకాలంలో ప్రయాణికులు తమ లగేజీని అందుకోలేకపోయారు. పాము కనిపించిన విషయాన్ని దుబాయ్ ఎయిర్పోర్టులోని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది కార్గో హోల్డ్ వద్దకు చేరుకుని, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు.

సకాలంలో లగేజీ అందకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. ఏడు గంటల పాటు విమానాశ్రయంలోనే గడిపారు. దీనితో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఏడు గంటల పాటు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు పడుతున్నామంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తమ కామెంట్స్కు జత చేశారు. దీన్ని ఎయిరిండియా యాజమాన్యానికి ట్యాగ్ చేశారు.
దీనిపై పూర్తి సమాచారాన్ని విమానాశ్రయం అధికారులు డీజీసీఏకు అందజేశారు. ఈ ఘటన పట్ల డీజీసీఏ కూడా విచారాన్ని వ్యక్తం చేసింది. జాప్యానికి చింతిస్తున్నామని తెలిపింది. కార్గో హోల్డ్లో పాము కనిపించిన ఉదంతంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. సమగ్ర నివేదికను అందజేయాలంటూ ఎయిరిండియా యాజమాన్యానికి సూచించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications