ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి కేకలు ; అడుగంటుతున్న ఆహార నిల్వలు ; హెచ్చరిస్తున్నా ఇంకా సంబరాల్లోనే తాలిబన్లు !!
ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు రోజురోజుకి దయనీయంగా మారుతున్నాయి. ఒకపక్క తాలిబన్ల పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళనల మధ్య, ఇప్పుడు ఆహార కొరత కూడా ఆఫ్ఘనిస్థాన్ వాసులను ఆకలి కేకలు పెట్టేలా చేస్తున్నాయి. తాలిబన్ల దురాక్రమణతో ఆఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఒకపక్క ప్రాణభయం, మరో పక్క ఆకలి బాధ ఆఫ్ఘనిస్థాన్ వాసులను కన్నీరు పెట్టిస్తోంది. ప్రపంచమంతా ప్రజల స్వేచ్ఛా వాయువులను పిలుస్తూ బ్రతుకుతున్న నేటి రోజుల్లో ఆఫ్ఘనిస్థాన్ వాసుల నిర్బంధ జీవనం నిత్య నరకాన్ని చూపిస్తుంది.
ప్రజల ఆకలి తీర్చడానికి తక్షణం 1460 కోట్ల రూపాయలు అవసరం
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో లక్షలాది మంది ప్రజలు తినడానికి తిండి లేక విలవిలలాడుతున్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద ఆఫ్ఘనిస్థాన్ కు అందించిన నిల్వలు ఈ నెల రోజులు మాత్రమే సరిపోతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత నిరుపేదల ఆకలి బాధలను తీర్చలేమని ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం అధ్యక్షుడు రమీజ్ అలక్ బరోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని మూడోవంతు ప్రజలు ఇప్పటికే ఆహార సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రజల ఆకలి తీర్చడానికి తక్షణం 1460 కోట్ల రూపాయలు అవసరమని స్పష్టం చేశారు.
ఆఫ్ఘనిస్థాన్ లో ఆహార కొరతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
తాలిబన్ల దురాక్రమణ తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రజలకు ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నామని, అయితే ఈ నెల తర్వాత ఆహారం అందించలేమని ఐక్యరాజ్యసమితి స్పష్టంగా చెప్పింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ఆహార కొరత, త్రాగు నీటి కొరత వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మగవారు లేని కుటుంబాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. తాలిబన్ల నియమాల ప్రకారం మహిళలు బయటకు వెళ్లకూడదు. ఈ క్రమంలో కేవలం మహిళలు మాత్రమే ఉన్న ఇళ్ళలో పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. వారు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం 4 నుండి 5 మిలియన్లకు పైగా కుటుంబాలకు ఆహార కొరత
ఆఫ్ఘనిస్థాన్ లో తాజా పరిణామాలతో ఆసుపత్రులు, మెడికల్ షాపులు ఎక్కడికక్కడ మూతపడ్డాయి. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నవారు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. మందులు కూడా దొరకని పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ప్రస్తుతం 4 నుండి 5 మిలియన్లకు పైగా కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. తాలిబన్ల కొత్త నియమాలు,గత మూడు నెలలుగా ఆఫ్ఘనిస్తాన్ కు చేరుకునే అన్ని మార్గాల మూసివేతతో నెలకొన్న ఆహారధాన్యాల కొరత వెరసి ఆఫ్ఘనిస్తాన్ ప్రజల జీవితం అత్యంత దుర్భరంగా మారబోతోంది.
యుద్ధంలో దెబ్బ తిన్న దేశంలో తీవ్ర దుర్భిక్షం
ఆఫ్ఘనిస్థాన్ దేశానికి జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలు కీలకమైనవి ఎందుకంటే రాబోయే శీతాకాలానికి ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం అవసరమైన సామాగ్రిని నిల్వ చేసే నెలలు ఈ మూడు నెలలు మాత్రమే . రాబోయే రెండు నెలల్లో, శీతాకాలం రావడం వల్ల ఆఫ్ఘనిస్థాన్ లోకి వచ్చే మార్గాలు మూసివేయబడతాయి. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ప్రపంచ ఆహార కార్యక్రమం యొక్క నివేదిక యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో రానున్న రోజుల్లో తీవ్ర ఆహార సంక్షోభ పరిస్థితిని ప్రతిబింబిస్తుంది .
రాబోయే నెలల్లో దేశంలో 14 మిలియన్లకు పైగా ప్రజలకు తీవ్రమైన ఆహార సంక్షోభం
రాబోయే నెలల్లో దేశంలో 14 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటారని హెచ్చరిస్తోంది. ఈ సంవత్సరం ఆఫ్ఘనిస్థాన్లో తీవ్రమైన కరువు సంభవించడంతో, పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. ఒక అంచనా ప్రకారం, ఇప్పటికే 40% పైగా పంటలు నష్టపోయారు . కరువు కారణంగా మూడింట ఒకవంతు పశువులు నాశనమయ్యాయి. ప్రభుత్వ గిడ్డంగులు అలాగే బహిరంగ గృహాలలో ఉంచిన చాలా నిల్వలు తాలిబన్లు దోచుకున్నారు. తాలిబన్ సైనికులకు ఆహారం ఇవ్వడానికి ఇప్పటికే ఉన్న పశువులను భయంకరమైన స్థాయిలో వధ చేస్తున్నారు.
ఆహార సంక్షోభంపై పట్టని తాలిబన్ పాలన .. అంధకారంగా ఆఫ్ఘన్ల భవిష్యత్
సమీప భవిష్యత్తులో భూ రవాణా మార్గాలు తెరిచే అవకాశం లేదు. ప్రపంచ బ్యాంకు మరియు ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా దుర్బలమైన రాజకీయ పరిస్థితులను ఊహించి వారి నిధుల పంపిణీని నిలిపివేశాయి. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ పరిపాలన దీని గురించి ఏమాత్రం ఆందోళన చెందకపోవడం గమనార్హం. తీవ్రమైన ఆకలి సంక్షోభం ముంచుకొస్తున్నా తాలిబన్లు అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో ఆసుపత్రుల కంటే ఎక్కువ ఆయుధ కర్మాగారాలు ఉన్నాయి. స్థానిక జనాభా గురించి తాలిబన్లు బాధపడినట్లు కనిపించనందున భవిష్యత్తు అంధకారంగా గోచరిస్తుంది. ఇప్పటివరకు, వారు యునైటెడ్ స్టేట్స్పై తమ విజయాన్ని జరుపుకోవడంలో బిజీగా ఉన్నారు . దేశానికి అంతర్జాతీయ మానవతా సహాయాన్ని ఆహ్వానించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు.
ఇప్పటికే ఆహార కొరత ఎదుర్కొంటున్న ఫ్రావిన్సులు ఇవే
ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (ఐపిసి) నివేదిక ప్రకారం, నాలుగు ప్రావిన్సులు డేకుండి, ఫర్యబ్, బడాఖాన్, మరియు ఘోర్ ఇప్పటికే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆహార కొరత కారణంగా పెద్ద ఎత్తున కరువును ఎదుర్కొనవచ్చు. ఐదు దశాబ్దాలుగా అంతర్యుద్ధం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నదేశం, 92% పైగా జనాభా రోజుకు 2 $ కంటే తక్కువ ఖర్చుతో జీవిస్తున్న దేశంలో, పరిస్థితి నిజంగా ఆందోళనకరంగా ఉంది . తక్షణ మానవతా జోక్యం అవసరం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున ఆకలి సంబంధిత మరణాల గురించి తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి ఉంది.
Recommended Video
తాలిబన్ల క్రూర పాలన.. అందులో ఆకలి కష్టాలు కూడా .. ఆఫ్ఘన్ల బతుకు నరకం
ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ దేశంలో ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు, మందులు లేదు, విద్య లేదు. ప్రపంచం అభివృద్ధి చెందుతోంది కానీ ఆఫ్ఘనిస్థాన్ తిరోగమనంలో ప్రయాణిస్తూ మధ్యయుగంలోకి వెళుతోంది. తీవ్రమైన కష్టాలు, షరియా, పితృస్వామ్య సమాజంతో క్రూరమైన పరిపాలన యుగం మళ్ళీ మొదలైంది. 16 వ శతాబ్దపు ఆఫ్ఘనిస్థాన్ కు మళ్లీ స్వాగతం పలికినట్లుగా పరిస్థితి ఉంది. క్రూరమైన, మతోన్మాద మరియు రక్తపిపాస ఉన్న తాలిబన్ల చేతుల్లోకి చేరిన ఆఫ్గనిస్థాన్ దేశంలో రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం తో పాటుగా ఆహార సంక్షోభం కూడా ప్రజలకు పెద్ద ముప్పుగా మారింది.