Kabul Airport..శాటిలైట్ ఫొటోలు: ఆఫ్ఘన్ల దుస్థితికి అద్దం
కాబుల్: మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్గా గుర్తింపు పొందిన తాలిబన్లు.. మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం ఒకసారి చవి చూసింది.. ప్రత్యేకించి- ఆ దేశ ప్రజలు. సంప్రదాయాల పేరుతో తాలిబన్లు విధించే ఆంక్షలు స్వయంగా భరించిన అనుభవం వారికి ఉంది.
New high-res #satellite imagery (10:36 am local time, August 16) of the chaotic scene underway at #Kabul’s Hamid Karzai International Airport in #Afghanistan as thousands of people converged on the tarmac & airport runways as countries attempt to evacuate personnel from the city. pic.twitter.com/L6lhlVms54
— Maxar Technologies (@Maxar) August 16, 2021
తాలిబన్ల పరిపాలనలో జీవించడం కంటే చావే నయమనుకుంటోన్నారక్కడి ప్రజలు. ఎప్పుడెప్పుడు దేశం విడిచి వెళ్లిపోదామా అంటూ ఎదురు చూస్తోన్నారు. పొరుగునే ఉన్న తజికిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ తమ సరిహద్దులను ఇప్పటికే మూసివేశారు. ఆప్ఘనిస్తాన్ నుంచి ఎవరినీ రానివ్వట్లేదు. అదే సమయంలో కాబుల్, కాందహార్, మజర్-ఐ-షరీఫ్, జలాలాబాద్ వంటి సరిహద్దులకు ఆనుకుని ఉన్న నగరాల నుంచి వెలుపలికి వెళ్లే రహదారులను తాలిబన్లు బ్లాక్ చేశారు. నగరాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Afghanistan: ప్రపంచ దేశాలకు భారత్ సారథ్యం: కేంద్రమంత్రి జైశంకర్కు అమెరికా ఫోన్ కాల్
సరిహద్దులను దాటుకోవడానికి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్ల ఆప్ఘనిస్తాన్ ప్రజలు విమానాలను ఆశ్రయిస్తోన్నారు. వేలాదిమంది కాబుల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అప్పటిదాకా అధికారంలో ఉన్న అష్రఫ్ ఘనీ సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన మరుక్షణం నుంచే వేలాది మంది స్థానికులు దేశం వదిలి వెళ్లడం ప్రారంభించారు. తజికిస్తాన్, ఇరాన్ సరిహద్దులకు చేరుకున్నప్పటికీ- వారు దాన్ని దాటుకోలేకపోయారు. సరిహద్దులను మూసివేయడం వల్ల సాధ్య పడలేదు.
మరోవంక- కాబుల్లో నివసిస్తోన్న వేలాది మంది హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. కనిపించిన విమానాన్ని కనిపించినట్టే ఎక్కేశారు. మరి కొందరు అమెరికాకు ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 విమానం టైర్లు, డోర్లు పట్టుకుని గాలిలో ప్రయాణించడానికి ప్రయత్నించి.. ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. వేలాదిమంది ఆప్ఘనిస్తానీయులను నియంత్రించడానికి అమెరికా సైన్యం కాల్పులు సైతం జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. ఏ మాత్రం కూడా ఊహించలేని పరిస్థితులవి. మొత్తంగా ఆ రోజంతా వేర్వేరు ఘటనల్లో 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఈ పరిణామాలన్నింటినీ కళ్లకు కట్టినట్టుగా చూపించాయి కొన్ని శాటిలైట్ ఫొటోలు. అక్కడి దుస్థితికి అద్దం పట్టాయి. మక్సర్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఈ ఫొటోలను చిత్రీకరించింది. మొత్తం నాలుగు శాటిలైట్ ఫొటోలను ఆ కంపెనీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. విమానాశ్రయంలో గుంపులు గుంపులుగా నిల్చున్న స్థానికులను ఈ ఫొటోల్లో స్పష్టంగా చూడొచ్చు. సోమవారం ఉదయం 10:36 నిమిషాలకు కాబుల్ ఎయిర్ పోర్ట్.. అక్కడికి దారి తీసే మార్గాలను చిత్రీకరించినట్లు మక్సర్ టెక్నాలజీస్ తెలిపింది.
కాబుల్ ఎయిర్ పోర్ట్కు దారి తీసే మార్గాలన్నీ కార్లతో నిండిపోవడాన్ని ఈ ఫొటోల్లో చూడొచ్చు. ఆప్ఘనిస్థానీయులు విమానాశ్రయానికి గంపులుగంపులుగా చేరుకోవడం కనిపించింది. కాబుల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న మరుక్షణం నుంచి ఆ రోజంతా కాబుల్ ఎయిర్ పోర్ట్ వార్తల్లో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఏరో స్పేస్ను కూడా మూసివేయాల్సి రావడం వల్ల- భారత్ సహా పలు దేశాలకు తరలింపు కార్యక్రమంలో జాప్యం ఏర్పడింది. రక్షణ మంత్రిత్వ శాఖ విమానాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వల్ల ఎయిరిండియాకు బదులుగా వైమానిక దళ ఎయిర్క్రాఫ్ట్లను పంపించాల్సి వచ్చింది భారత్కు.