ట్రంప్ నిర్ణయాలతో ఈ రంగాలపై భారీ దెబ్బ-ఎఫెక్ట్ తగ్గించేందుకు కేంద్రం యత్నాలు..!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అగ్రరాజ్యాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో వలసల బహిష్కరణ, పరస్పర పన్నులతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో పరస్పర పన్నుల విధింపుతో భారత్ వంటి దేశాలకు భారీ ఎదురుదెబ్బలు ఖాయమని తేలిపోతోంది. అయితే ఇందులో భారత్ లో ఏయే రంగాలు ఉన్నాయన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
ట్రంప్ పన్నుల మోత
అమెరికా వస్తువులపై ఇతర దేశాలు ఎంత పన్ను విధిస్తాయో అంతే పన్నును తాము కూడా వారి వస్తువులపై విధిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా తేల్చిచెప్పేశారు. ఇప్పటికే మెక్సికో, కెనడా, బ్రెజిల్ వంటి దేశాలపై పన్నులు ప్రకటించిన ట్రంప్.. ఆ తర్వాత చైనా, భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లు కలిగిన ఆయా దేశాలు విలవిల్లాడటం ఖాయంగా కనిపిస్తోంది.

భారత్ లో ఈ రంగాలకు షాక్
భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాజా భేటీలోనే పరస్పర పన్ను విధిస్తామని బహిరంగంగానే చెప్పేసిన ట్రంప్.. ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు భారత్ విక్రయిస్తున్న పలు వస్తువులపై పన్నుల మోత మోగబోతోంది. ఇందులో ఆహార పదార్థాలు, కూరగాయలు, దుస్తులు,ఎలక్ట్రికల్ పరికరాలు, రత్నాలు, నగలు, ఫార్మాస్యూటికల్స్, కార్లు, ఇనుము, ఉక్కు ఉన్నాయి. ట్రంప్ నిర్ణయంతో భారత్ కు చెందిన ఈ రంగాల పరిశ్రమలు నష్టపోవచ్చని అంచనా. ఎందుకంటే భారీ సుంకాలు అమెరికాలో భారతీయ ఉత్పత్తులను మరింత ఖరీదైనవిగా చేస్తాయి.
భారత్ లో గగ్గోలు
భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించే పన్నుల కంటే అమెరికా వస్తువులపై భారత్ చాలా ఎక్కువ పన్నులు విధిస్తోందని ట్రంప్ ఈ మధ్యే ఆక్షేపించారు. సగటున భారతదేశం తమ వస్తువులపై 9.5 శాతం పన్నును వసూలు చేస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాలో భారతీయ వస్తువులపై మాత్రం సగటున 3 శాతమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని సవరించేందుకు ట్రంప్ విధిస్తున్న పరస్పర పన్నుల కారణంగా ఇప్పుడు ఇక్కడి వ్యాపారులకు లాభాలు భారీగా తగ్గిపోతాయి.
దీంతో వీరంతా గగ్గోలు పెడుతున్నారు.
కేంద్రం యాక్షన్ ఇదే
ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువులపై సుంకాల్ని తగ్గించేందుకు భారత్ పలు చర్యలు తీసుకుంటోంది. అమెరికాకు ఎగుమతి చేస్తున్న 30 వస్తువులపై సుంకాలు తగ్గించేందుకు కేంద్రం నిర్ణయాలు ప్రకటిస్తోంది.
అదే సమయంలో అమెరికా నుంచి రక్షణ,ఇంధన రంగాల్లో ఉత్పత్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షిష్టంగా మారిన నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత ఆర్దిక వ్యవస్థపై ట్రంప్ దెబ్బ తప్పదని తేలిపోవడంతో కేంద్రం అందుకు మన వాళ్లను మానసికంగా సిద్దం చేస్తోంది.












Click it and Unblock the Notifications