థర్డ్వేవ్ వచ్చేసిందా?: విస్తరిస్తోన్న కొత్త కరోనా వేరియంట్: ఆ దేశాలకు విమాన సర్వీసులు రద్దు
బెర్లిన్: రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి.. సరికొత్త రూపాల కలకలం రేపుతోంది. జనంపై దాడి మొదలు పెట్టింది. కొత్త వేరియంట్ ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్ కరోనా వైరస్.. 30 మ్యుటేషన్లతో విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో దీనికి సంబంధించిన వేరియంట్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తోంది. దీనికి అనుగుణంగా ఆయా దేశాల్లో కరోనా వైరస్ కేసులు రెట్టింపు అవుతున్నాయి.
స్వీయ ఓదార్పు యాత్ర: ప్రజలు నాశనం కావాలని కోరుకున్న చరిత్ర ఆయనది..: సాయిరెడ్డి
శరవేగంగా వ్యాప్తి..
ఈ పరిణామాలను థర్డ్వేవ్ ముప్పుగా భావిస్తున్నారు నిపుణులు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చిందనే ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నారు. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత దాని తీవ్రత ఆఫ్రికన్ దేశాలపై పడిన సందర్భం పరిమితంగానే కనిపించింది. సెకెండ్ వేవ్లోనూ అవే తరహా పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఈ రెండింటికీ భిన్నంగా ఈ దఫా ఈ ప్రాణాంతక మహమ్మారి ఆఫ్రికన్ దేశాల్లో పడగ విప్పింది. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.
కొత్త వేరియంట్..
దక్షిణాఫ్రికాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ను బీ.1.1.529 (B.1.1.520)గా గుర్తించారు. దీనికి సంబంధించిన 30 మ్యుటేషన్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కొత్త రకం వేరియంట్కు శరవేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్, సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొననున్నారు. వ్యాక్సిన్కు కూడా లొంగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఆసియాలోనూ..
కొత్త రకం వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్సువానా సహా ఆసియాలోని హాంగ్కాంగ్లోనూ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ బారిన పడిన వారు.. దక్షిణాఫ్రికాలో పర్యటించారు. తమ స్వదేశానికి వెళ్లారు. అనంతరం వారు అనారోగ్యానికి గురయ్యారు. వారికి పరీక్షలను నిర్వహించగా.. బీ.1.1.529 బారిన పడినట్లు తేలింది. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా శివార్లలోని ష్వానె మెట్రోపాలిటన్ ఏరియాలో ఈ వైరస్ను తొలిసారిగా గుర్తించారు. అనంతరం శరవేగంగా వ్యాప్తి చెందినట్లు నిర్దారించారు.
ఆరు దేశాలకు విమానాలు రద్దు..
ఈ పరిణామాల నేపథ్యంలో- బ్రిటన్ కూడా తక్షణ చర్యలు తీసుకుంది. ముందుజాగ్రత్తగా ఆరు ఆఫ్రికన్ దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ మేరకు బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ ఉత్తర్వులను జారీ చేశారు. బోట్సువానా, దక్షిణాఫ్రికా సహా మరో నాలుగు దేశాలను ఈ జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. వాటన్నింటినీ రెడ్ లిస్ట్లో చేర్చినట్లు జావిద్ తెలిపారు. ఆయా దేశాల నుంచి వచ్చే బ్రిటన్ పౌరులు కూడా తప్పనిసరిగా క్వారంటైన్లోకి వెళ్లాలని ఆదేశించారు.
తాజాగా జర్మనీ కూడా..
తాజాగా జర్మనీ కూడా విమానాల రాకపోకలను నిషేధించింది. దక్షిణాఫ్రికా సహా నాలుగైదు దేశాలకు విమాన సర్వీసులను నడిపించడాన్ని రద్దు చేసింది. సాధారణ పరిస్థితులు ఏర్పడేంత వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఆదేశ కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి నుంచి దీన్ని అమలులోకి తీసుకుని రానుంది. దక్షిణాఫ్రికాలో నివసిస్తోన్న తన దేశ పౌరులు మాత్రమే విమానాల్లో ప్రయాణించాలని ఆదేశించింది. జర్మన్లు అక్కడి నుంచి స్వదేశానికి చేరుకున్న వెంటనే ఈ ట్రావెల్ బ్యాన్ అమలు చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాహ్న్ తెలిపారు.
భారత్లో కొత్త కేసులు లేవు..
కాగా- కరోనాకు చెందిన బీ.1.1.529 రకం కేసులు భారత్లో నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీ.1.1.529 వైరస్ పాజిటివ్ కేసులేవీ ఇప్పటిదాకా దేశంలో వెలుగులోకి రాలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ.. దక్షిణాఫ్రికా సహా ఇతర ఆఫ్రికన్ దేశాల్లో పర్యటించి వచ్చిన వారిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, విమానాశ్రయాల్లో వారి కోసం ప్రత్యేకంగా థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపింది. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను జారీ చేసింది.