ఎయిర్ఏషియా ఇలా కూలింది: విచారణ అధికారులు
ఇండోనేషియా: గత డిసెంబర్లో జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా విమాన దుర్ఘటనకు సంబంధించిన కారణాలను విచారణ అధికారులు వెల్లడించారు. విమానంలోని రడ్డర్ కంట్రోల్ వ్యవస్థలో ఏర్పడ్డ లోపాల వల్ల పైలెట్లు ఆ విమానాన్ని అదుపు చేయలేకపోయారని విచారణ అధికారులు నిర్ధారించారు.
గత డిసెంబర్లో ఎయిర్ ఏషియా విమానం కూలిన ప్రమాదంలో సుమారు 162 మంది ప్రయాణికులు మరణించారు. ఇండోనేషియాలోని సురబయా విమానాశ్రయం నుంచి సింగపూర్కు బయలుదేరిన ఆ విమానం జావా సముద్రంలో కూలింది.
టేకాఫ్ తీసుకున్న 40 నిమిషాలకే ఆ విమాన జాడ గల్లంతైంది. దాదాపు ఏడాది పాటు విచారణ చేసిన తర్వాత అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. గగనతలంలో ఎగురుతున్న సమయంలో విమానంలో ఉన్న రడ్డర్ కంట్రోల్ సిస్టమ్లోని కంప్యూటర్ లోపానికి గురైంది. దాంతో పైలట్లు దాన్ని సరి చేసే పనిలో మునిగిపోయారు.

ఆ రోజు ఫ్లైట్ ఎగిరిన తర్వాత అప్పటికే నాలుగుసార్లు ఆ సమస్య ఉత్పన్నమైంది. కంట్రోల్ సిస్టమ్ను రిపేర్ చేసేందుకు పైలట్లు కొన్ని కనెక్షన్లను తీసేశారు. దీంతో ఆటోపైలట్ నుంచి సమాచారం కూడా నిలిచిపోయింది. ఆ దశలో పైలట్లకు ఎటువంటి సంకేతాలు అందలేదు.
గగనతల గమ్యానికి సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో పైలట్లకు ఏం చేయాలో తెలియలేదు.
ఈలోపు ఆ విమానం ప్రయాణించాల్సిన మార్గం మారింది. ప్లేన్ ఎడమ వైపు అడ్డం తిరిగింది. దాన్ని మళ్లీ దారిలోకి తెచ్చేందుకు పైలట్లు ప్రయత్నించారు. కానీ ఆ టైంలో అది నిశ్చలంగా మారింది. చివరకు విమానం సముద్రంలో కూలిపోయినట్లు విచారణ అధికారులు స్పష్టం చేశారు.
ఎయిర్బస్ 320 విమానం గత ఏడాది డిసెంబర్ 28న జావా సముద్రంలో కూలింది. కొన్ని రోజుల తర్వాత వాటి శిథిలాలను నావికులు గుర్తించారు.












Click it and Unblock the Notifications