ఎయిర్బస్ ఏ320 మోడీ ట్వీట్: ఫ్రాన్స్లో పెద్ద ప్రమాదం, బ్లాక్బాక్స్ లభ్యం
ప్యారిస్: జర్మనీ విమాన ప్రమాదం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా మోడీ స్పందించారు.
జర్మనీకి చెందిన జర్మన్ వింగ్స్ ఎయిర్ బస్ విమానం మంగళవారం ఫ్రాన్స్ ఆల్ప్స్ ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 146మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో ఫ్రాన్స్లో ఇంత ఘోర ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి.
లుఫ్తాన్సా అనుబంధ సంస్థగా ఉన్న జర్మన్ వింగ్స్ ఎయిర్ బస్ ఎ-323 విమాన ప్రమాద ఘటనలో బతికి బయటపడ్డవారెవరూ లేరని ఫ్రాన్స్ జూనియర్ రవాణా మంత్రి అలైన్ విడాలిస్ వెల్లడించారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో విస్తృతంగా అన్వేషణ జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం సుదూరమైనది కావడం వల్ల అక్కడికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేవని, ప్రమాద వివరాలు కూడా ఆలస్యంగానే వచ్చాయని తెలిపారు.
ఈ విమానం రాడార్ గతి తప్పిందని, స్థానిక కాలమానం ప్రకారం పదిన్నర ప్రాంతంలో ప్రమాద సంకేతాలు అందాయని ఆయన వెల్లడించారు. ప్రమాద సంకేతాలు అందే సమయానికి అసాధారణ పరిస్థితుల్లో ఈ విమానం ఐదువేల అడుగుల ఎత్తులో ఉందని వెల్లడించారు. ప్రమాద సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పెయిన్ రాజు ఫిలిపే తన ఫ్రాన్స్ పర్యటనను రద్దుచేసుకున్నారు.
మృతి చెందినవారిలో జర్మనీలతో పాటు స్పెయిన్కు చెందిన ప్రయాణీకులు ఉన్నారు. విమానంలో తమ దేశస్థులు కనీసం ఒకరు ఉన్నారని బ్రెజిల్ పేర్కొంది. 67 మంది జర్మన్లు ఉన్నారని జర్మన్ వింగ్స్ చెప్పగా, 45 మంది స్పెయన్ దేశస్థులున్నట్లు స్పెయన్ వెల్లడించింది. విమానంలో 16 మంది టీనేజ్ విద్యార్థులు ఉన్నట్లు స్పెయిన్ అధికారులు చెప్పారు.
ప్రమాద ప్రాంతానికి చేరుకోవడానికి సహాయ బృందాలకు కొన్ని గంటల సమయం పట్టిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సంఘటనపై జర్మనీ చాన్స్లర్ అంజీలా మార్కెల్తో ఫోన్లో మాట్లాడిన హొలాండే జర్మనీ ప్రజలకు తన సానుభూతిని, సంఘీభావాన్ని తెలిపారు. అలాగే దేశీయ వ్యవహారాల మంత్రి బెర్నాల్డ్ కజెనేవ్ ప్రమాద స్థలానికి తరలివెళ్లారు.
ప్రధానమంత్రి మాన్యుయల్ వాల్స్ అత్యవసరంగా అంతర్ మంత్రిత్వ శాఖల ప్రమాద విభాగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుర్ఘటనకు కారణాలేమిటన్నది స్పష్టం కాలేదని వాల్స్ తెలిపారు. స్పెయిన్ కోస్తా నగరమైన బెర్సిలోనా నుంచి జర్మనీ పట్టణమైన డూసెల్ డార్ఫ్కు వెళుతున్న సమయంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లోని స్కీ రిసార్ట్లో కూలిపోయింది.
ఒక్కసారిగా ఆకాశం బద్దలైనట్లుగా శబ్దం వినిపించిందంటూ ప్రమాద సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫ్రెంచ్ టెలివిజన్ చానల్కు తెలిపాడు. లెస్ ట్రోయిస్ ఎవేషియస్ అనే పర్వత ప్రాంతంలో ఈ విమాన శిథిలాలు చెల్లాచెదురుగా పడివున్నట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతం ఉపరితలానికి 1400మీటర్ల ఎత్తులో ఉంది. భారీ ఎత్తున సహాయ బృందాలను ప్రమాద స్థలానికి పంపామని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ప్రాంతమంతా మంచుమయం కావడం, వాహనాలు వెళ్ళడానికి ఎంతమాత్రం వీలులేనిదిగా ఉండటం వల్ల అక్కడికి సహాయ బృందాలు చేరుకోవడం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థకు చెందిన విమానాలు ఇంతటి ఘోర ప్రమాదానికి గురైన దాఖలాలు లేవు. రేపటినుంచి తలపెట్టిన సమ్మెను ఫ్రాన్స్ విమాన రవాణా సిబ్బంది వాయిదా వేసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా, ఈ ప్రమాదం ఫ్రాన్స్ చరిత్రలో పెద్ద ప్రమాదం. 1947 తర్వాత ఫ్రెంచి ప్రధాన భూభాగంలో జరిగిన ఘోర ప్రమాదం కూడా ఇదే. కాగా, జర్మన్ వింగ్స్ మాతృ సంస్థ అయిన లుఫ్తాన్సా బ్లాక్ డేగా అభివర్ణించింది. లుఫ్తాన్సా చరిత్రలోనే ఘోర విమాన ప్రమాదాలు లేవు. జర్మన్ వింగ్స్ విమానం ప్రమాదానికి గురై ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. స్పెయిన్ లోని బార్సిలోనా నుండి జర్మనీలోను డ్యూసెల్ డార్ఫ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, విమానంకు చెందిన బ్లాక్ బాక్స్ గుర్తించినట్లు తెలుస్తోంది.