ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలి.. ఆఫ్గన్ కోసం కలిసి రావాలి... ఐక్యరాజ్య సమితి పిలుపు...
ఆఫ్గనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఆఫ్గనిస్తాన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఐరాస చీఫ్ ఆంటానియో గుటెరస్ పిలుపునిచ్చారు.యావత్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించే ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గనిస్తాన్ మరోసారి వేదిక కాకుండా,ఉగ్ర సంస్థలు దాన్ని సురక్షిత స్థావరంగా చేసుకునే అవకాశం ఇవ్వకుండా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులపై ఐరాస అత్యవసరంగా నిర్వహించిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో గుటెరస్ మాట్లాడారు.
'ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్కు,అంతర్జాతీయ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా... కలిసి నిలబడుదాం... కలిసి పనిచేద్దాం... కలిసి చర్యలు తీసుకుందాం...' అని పిలుపునిచ్చారు.ఆఫ్గనిస్తాన్ ప్రజల కనీస మానవ హక్కులకై,ఆఫ్గన్లో ఉగ్రవాద ముప్పును అణచివేసేందుకు అన్ని దేశాలు అవసరమైన అన్ని సాధనాలను ఉపయోగించాలన్నారు.ఈ విపత్కర సమయంలో ఆఫ్గన్ల మన మద్దతు అవసరమన్నారు. రాబోయే రోజులు అత్యంత కీలకమని... ప్రపంచమంతా అక్కడి పరిస్థితిని గమనిస్తోందని... ఆఫ్గనిస్తాన్ ప్రజలను మనం అలా వదిలేయకూడదని అన్నారు. ఆఫ్గన్ స్త్రీలు,ప్రజలందరి మానవ హక్కులను,స్వేచ్చను తాలిబన్లు గౌరవించాలని అన్నారు.

ఆఫ్గన్ పరిస్థితి ఎంత హృదయవిదారకంగా ఉందో కళ్లకు కట్టేలా ఇప్పటికే పలు వీడియోలు వెలుగుచూశాయి. అవకాశం చిక్కితే దేశం వదిలి పారిపోయేందుకే ఆఫ్గన్లు మొగ్గుచూపుతున్నారు. తాలిబన్ల పాలనలో బతుకు,భవిష్యత్తు రెండూ ప్రశ్నార్థకమేనని ఆందోళన చెందుతున్నారు. ఓవైపు ఆఫ్గన్ ప్రజలు ఇంతలా ఆందోళన,ఆవేదన చెందుతుంటే... తాలిబన్ల పాలనను పాకిస్తాన్,ఇరాన్,చైనా వెనకేసుకురావడం గమనార్హం. ఆఫ్గనిస్తాన్లో అమెరికా ఓటమి శాంతి పునరుద్ధరణకు దోహదం చేస్తుందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ అన్నారు. అఫ్గన్ను తాలిబన్లు చేజిక్కించుకోవడంతో... అక్కడ భద్రతతో కూడిన జీవనం, శాంతి స్థాపనకు చక్కటి అవకాశం లభించిందని పేర్కొన్నారు. అఫ్గనిస్తాన్తో ఇరాన్ సత్సంబంధాలు ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు.తాలిబన్లతో స్నేహపూర్వక బంధాలు కోరుకుంటున్నామంటూ చైనా ప్రకటించింది. అటు పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్... తాలిబన్ల పాలనను స్వాగతిస్తూ బానిస సంకెళ్లను తెంచారని వ్యాఖ్యానించారు.
ఆఫ్గనిస్తాన్లో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు రెండు దశాబ్దాల పాటు అక్కడ పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవల అక్కడి నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో తాలిబన్లు మరింత రెచ్చిపోయారు. అడ్డూ అదుపూ లేకుండా క్రమంగా దేశం మొత్తాన్ని ఆక్రమించేశారు. గతేడాది ఖతర్లో తాలిబన్లతో కుదిరిన శాంతి ఒప్పందం మేరకు అమెరికా తమ సైనిక దళాలను ఉపసంహరించుకుంది. అయితే తాలిబన్ల కపట ఒప్పందం గురించి తెలిసి కూడా అమెరికా అక్కడి నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. యుద్ధం పూర్తి చేయకుండానే... ఆ భారం మొత్తం ఆఫ్ఘన్ ప్రజలపై వేసి వెళ్లిపోవడం సరికాదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications