ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు బిగ్ షాక్.. తొలిసారి అలా !
ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అగ్రరాజ్యానికి తాజాగా ప్రాణనష్టం సంభవించింది. United States Central Command (CENTCOM) విడుదల చేసిన ప్రకటనలో.. ఈ ఆపరేషన్లో ముగ్గురు అమెరికన్ సైనికులు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం ప్రాంతంలో భారీ స్థాయి యుద్ధ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న యుద్ధ కార్యకలాపాలు..
సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్ సైనిక, భద్రతా వ్యవస్థలకు చెందిన కీలక మౌలిక వసతులపై లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. వైమానిక దాడులు, నౌకాదళ పర్యవేక్షణ, గగనతల గూఢచర్యం వంటి చర్యలు సమాంతరంగా జరుగుతున్నాయని సమాచారం. గాయపడిన సైనికులకు అత్యవసర చికిత్స అందించగా, స్వల్ప గాయాలైన కొందరిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశముందని సైన్యం పేర్కొంది.

మరణించిన జవాన్ల కుటుంబాలకు సమాచారం అందించిన 24 గంటల తర్వాతే వారి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని సైన్యం స్పష్టం చేసింది. ఈ సంఘటన వాషింగ్టన్లో ఆందోళన కలిగించింది. అలానే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తమ యుద్ధ నౌక USS Abraham Lincoln పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారన్న వార్తలను CENTCOM తీవ్రంగా ఖండించింది. ఆ నివేదికలు పూర్తిగా అసత్యమని, ఇరాన్ క్షిపణులు నౌక దరిదాపుల్లోకూ రాలేదని పేర్కొంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ సురక్షితంగా ఉందని, మధ్యప్రాచ్య ప్రాంతంలో భద్రతా చర్యల్లో కీలక పాత్ర పోషిస్తోందని సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
అంతర్జాతీయ ప్రతిస్పందనలు..
ఈ తాజా పరిణామాలతో గ్లోబల్ మార్కెట్లు, అంతర్జాతీయ రాజకీయ వర్గాలు అప్రమత్తమయ్యాయి. యూరోపియన్ దేశాలు తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించేందుకు పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. చమురు ధరలు కూడా ఈ ఉద్రిక్తతల ప్రభావంతో పెరుగుదల దిశగా కదులుతున్నాయి.
వాషింగ్టన్లో రాజకీయ చర్చ..
ఇప్పటికే జరిగిన వైమానిక దాడుల్లో Ayatollah Ali Khamenei సహా పలువురు కీలక నేతలు మరణించిన నేపథ్యంలో, తాజా సైనిక ప్రాణనష్టం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆపరేషన్ లక్ష్యాలు, దీని కాలపరిమితి, వ్యూహాత్మక ప్రణాళికపై చర్చ జరుగుతోంది. కొంతమంది చట్టసభ్యులు ఆపరేషన్ను కొనసాగించాల్సిన అవసరాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు దీర్ఘకాలిక యుద్ధం ప్రమాదాలపై హెచ్చరిస్తున్నారు.
భవిష్యత్ పరిస్థితి..?
ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికా తమ సైనిక దళాలను అప్రమత్తంగా ఉంచగా, ఇరాన్ కూడా ప్రతిస్పందన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ ఆపరేషన్ మరింత విస్తరించే అవకాశముందా? లేక దౌత్యపరమైన చర్చల దిశగా అడుగులు పడతాయా? అన్నది గమనించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications