‘‘80 దేశాల్లో 8000 మందితో మనం రెడీ.. కిమ్ బరితెగిస్తే..ఇలా కోరలు పీకేస్తాం’’
వాషింగ్టన్: అమెరికా సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు బెదిరింపులకు దిగుతున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను ఎలా దెబ్బతీయాలో తమకు తెలుసని అమెరికా మిలటరీ జనరల్ ఆ దేశ శాసనసభ సబ్ కమిటీ సమావేశంలో వివరించారు.
కిమ్ హెచ్చరికల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఉత్తరకొరియా శక్తి సామర్థ్యాలు, ఆ దేశం తయారు చేసిన అణ్వాయుధాలు, దాడుల తీవ్రత వంటి అన్ని అంశాలపై కులంకషంగా ఈ సమావేశంలో చర్చించింది.
అమెరికా మిలిటరీ జనరల్ రేమండ్ ఏ థామస్ ఈ సమావేశంలో మరో ఆసక్తికర అంశాన్ని కూడా వెల్లడించారు. ఒకవేళ యుద్ధం తప్పనిసరైతే ఉత్తరకొరియా ఆటలు సాగనివ్వకుండా ఉండేందుకు ఉత్తర కొరియాకి చెందిన అణ్వాయుధ, క్షిపణి వెబ్ సైట్లను ధ్వంసం చేయగల అత్యాధునిక శాస్త్ర సాంకేతిక దళం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
సుశిక్షితులైన ఈ దళంలోని సభ్యులు ప్రపంచంలోని ఏ మూలనున్న వెబ్ సైట్లనైనా సులభంగా ధ్వంసం చేయగలరని అన్నారు. ఈ దళం ఇప్పటికే కొరియన్ వెబ్ సైట్లపై ఓ కన్నేసి ఉంచిందని ఆయన చెప్పారు.
అంతే కాకుండా అవసరమైతే ప్రపంచంలోని 80 దేశాల్లో దాదాపు 8000 మందితో సిధ్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే అమెరికా అంచనాలకు అందకుండా అడుగులు వేసే కిమ్ జాంగ్ ఉన్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో తెలియాల్సి ఉంది.