ఎట్టకేలకు ఒప్పుకున్న చైనా.. కమాండింగ్ ఆఫీసర్ చనిపోయాడని వెల్లడి.. సైనికుల సంఖ్యపై గోప్యత..
తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో గత వారం చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలో మనవాళ్లు 20 మంది చనిపోగా, మరో 76 మంది గాయపడ్డట్లు స్వయంగా ఆర్మీనే ప్రకటించినా.. చైనా వైపు ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారనే విషయాన్ని మాత్రం ఆ దేశం దాచిపెడుతూ వచ్చింది. సరిహద్దులో ఉద్రిక్తతల నివారణ కోసం సోమవారం జరిగిన చర్చల్లో డ్రాగన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుందని, గాల్వాన్ ఘర్షణలో తమవాళ్లు కూడా చనిపోయారని చెప్పినట్లు వెల్లడైంది.
చైనా సరిహద్దులో మళ్లీ సైనికుల ఘర్షణ? కీలక చర్చల వేళ కొట్లాట వీడియో.. మనోళ్లు ఉతికేశారు..
నిజానికి గాల్వాన్ ఘర్షణపై భారత సైన్యం చేసిన తొలి ప్రకటనలోనే.. చైనా వైపు కూడా చాలా మందికి గాయాలైనట్లు పేర్కొంది. అటు వైపు కనీసం 40 మంది జవార్లు హతమయ్యారని, అందులో ఆఫీసర్ స్థాయి అధికారులు కూడా ఉన్నారని డిఫెన్స్ నిపుణులు చెప్పారు. కానీ చైనా ఆర్మీగానీ, ఆ దేశ ప్రభుత్వంగానీ ఎక్కడా దీనిపై మాట్లాడలేదు. కాగా, చైనా సోషల్ మీడియా వెబోలో మాత్రం సైనికుల మరణాలపై చర్చ జరిగింది. చనిపోయిన సైనికుల వివరాలను వెల్లడించకుండా జిన్ పింగ్ సర్కారు తప్పు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కూడా ఓ కమాండింగ్ ఆఫీసర్ మరణాన్ని మాత్రమే ధృవీకరించిన చైనా.. చనిపోయిన సైనికుల సంఖ్యపై మాత్రం గోప్యత పాటించడం గమనార్హం.
వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి రెండు వైపులా మోహరించి ఉన్న సైనిక బలగాలను ఉపసంహరించుకునే దిశగా ఈనెల 6న అంగీకారం కుదిరింది. చరిత్రలో తొలిసారి లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో జరిగిన చర్చలు ఆ మేరకు ఫలించాయని సంతోషించేలోపే.. గాల్వాన్ లో హింస చోటుచేసుకుంది. దీంతో సరిహద్దు అంతటా మళ్లీ టెన్షన్ పెరిగిపోయింది. వివాదాలను శాంతియుతంగానే పరిష్కరించుకుందామన్న కేంద్రం సూచన మేరకు రెండోసారి లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి భేటీ సోమవారం జరిగింది. కొత్తగా ఎలాంటి అంగీకారాలు కుదిరాయన్న విషయాన్ని ఆర్మీ వర్గాలు వెల్లడించాల్సి ఉంది.