రేపు భారత్ కు మరో అమెరికా విమానం-ట్రంప్-మోడీ చర్చలు విఫలం ?
ఆమెరికాలో అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎట్టి పరిస్ధితుల్లోనూ వెనక్కి తగ్గేందుకు నో అంటున్నారు. అమెరికాలో మూడో అతిపెద్ద వలసదారుల జనాభా ఉన్న భారత్ ను టార్గెట్ చేసుకుని ఇప్పటికే అరెస్టులు, స్వదేశానికి తరలింపులు కొనసాగిస్తున్న ట్రంప్.. ఇప్పుడు ప్రధాని మోడీతో నిన్న జరిగిన చర్చల తర్వాత కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మరో అమెరికా మిలటరీ విమానం భారతీయులతో రేపు స్వదేశానికి రానుంది.
అమెరికాలో అక్రమ వలసల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పేసినట్లు తెలుస్తోంది. గత వారం అమృత్ సర్ కు భారతీయ వలసలతో కూడిన తొలి విమానం రాక ముందే ట్రంప్ కు తాను అమెరికా వచ్చి మాట్లాడతానని మోడీ చెప్పారు. అయితే మోడీ-ట్రంప్ మధ్య తాజాగా జరిగిన చర్చల్లో ఈ మేరకు పురోగతి ఏమీ లేదని తెలుస్తోంది. దీంతో మరో మారు భారతీయ వలసల్ని స్వదేశానికి పంపేందుకు ట్రంప్ విమానం సిద్దం చేస్తున్నారు.

ట్రంప్ తో భేటీలో వలసలపై మాట్లాడిన అంశాలపై ప్రధాని మోడీ బహిరంగంగా చెప్పకపోయినా ఫలితం మాత్రం లేదని అర్థమవుతోంది. దీంతో విదేశీ వలసలపై భారత్, అమెరికా విధానాలు ఒక్కటే అంటూ మోడీ సన్నాయి నొక్కులు నొక్కారు. ఈ నేపథ్యంలో భారతీయుల్ని స్వదేశానికి తరలింపు ఆగబోదని అర్దమైపోయింది. అన్నట్లుగానే ట్రంప్ మరో రెండు విమానాల్లో భారతీయుల్ని వెనక్కి పంపేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా ఓ విమానం రేపు మరోసారి అమృత్ సర్ లోనే ల్యాండ్ కానుంది. ఇందులో 119 మంది ఉన్నట్లు సమాచారం. మరో విమానం కూడా ఎల్లుండి భారత్ కు వచ్చే అవకాశాలున్నాయి.
ఇప్పటికే తొలి విమానం గతవారం టెక్సాస్ నుంచి బయలుదేరి 104 మంది భారతీయులతో అమృత్ సర్ చేరుకుంది. ఇందులో వచ్చిన వారు కాళ్లకు, చేతులకు బేడీలతో కనిపించారు. దీనిపై పార్లమెంట్ లో సైతం అధికార, విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. ఇలాంటి సమయంలో రేపు మరో విమానం భారత్ కు వస్తే అందులో ఉన్న వారు ఎలా ఉండబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే వీరి పరిస్ధితి ఎలా ఉన్నా భారత్ కు మాత్రం ఇలా అమెరికన్ విమానాల రాక మాత్రం కొనసాగడం తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications