చిన్న ట్రిక్ ప్లే చేసిన పాక్- బుట్టలో పడ్డ ట్రంప్..!!
Donald Trump- Asmi Munir Lunch meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ పై పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కారు. పాకిస్తాన్ కూ స్నేహహస్తాన్ని అందించారు. భారత్- పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని ఆపానంటూ చెప్పుకొంటూ వస్తోన్న ఆయన ఈ సారి మరో అడుగు ముందుకేశారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన సూత్రధారిగా విమర్శలను ఎదుర్కొంటోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ తో సమావేశం కావడం తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. అసీమ్ మునీర్ తో కలిసి వైట్ హౌస్ లో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడొకరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ లో ఏకాంతంగా ఆతిథ్యాన్ని ఇవ్వడం ఇదే మొదటిసారి.

ఈ భేటీ తరువాత డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అసీమ్ మునీర్ తో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నానని తేల్చి చెప్పారు. భారత్- పాకిస్తాన్ రెండూ తనకు సమానమేనని, ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని నిలిపివేశానని ట్రంప్ పునరుద్ఘాటించారు. తన మాటకు విలువ ఇచ్చి భారత్ తో యుద్ధాన్ని ఆపినందుకు అసీమ్ మునీర్ కు కృతజ్ఞతలు తెలుపుకొంటోన్నానని అన్నారు.
అసిమ్ మునీర్ కు ఏకంగా వైట్ హౌస్ లో ప్రవేశం లభించడమే గొప్ప అనుకుంటే.. ఏకాంతంగా డొనాల్డ్ ట్రంప్ తో భోజనం చేయడం, ఆతిథ్యాన్ని పొందడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దీని వెనుక పెద్ద కథే నడిచింది. ట్రంప్ బలహీనత మీద పాకిస్తాన్ దృష్టి పెట్టిందని, అదే ఆయనను వైట్ హౌస్ లో అడుగు పెట్టేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, దీనికి తగిన అర్హతలన్నీ ఆయనకు ఉన్నాయని అసీమ్ మునీర బహిరంగంగా వెల్లడించారు. అమెరికా పర్యటనకు వచ్చిన తొలి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ను నామినేట్ చేయాలని, దానికి తాము పూర్తిగా మద్దతు ఇస్తోన్నామని అన్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధాన్ని నివారించడంలో డొనాల్డ్ ట్రంప్ కీలకంగా వ్యవహరించారనీ మునీర్ స్పష్టం చేశారు. ఆయన చెప్పడం వల్ల తామే ఈ యుద్ధాన్ని నిలిపివేశామని అన్నారు. దీని తరువాతే మునీర్ కు వైట్ హౌస్ నుంచి పిలుపు వచ్చిందని, అధ్యక్షుడితో ప్రైవేట్ లంచ్ మీటింగ్ కు ఆహ్వానం అందిందని చెబుతున్నారు.
ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి అన్నా కెల్లీ పరోక్షంగా వెల్లడించారు కూడా. భారత్- పాక్ సైనిక చర్యను అణు యుద్ధంగా మారకుండా నివారించుకోవడంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఉందని మునీర్ ప్రశంసించినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications