పెళ్లి వేడుకపై వైమానిక దాడి: 30మంది మృతి
సనా: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. యెమెన్లోని ధామర్ ప్రావిన్స్లో ఓ భవనంలో పెళ్లి వేడుకలు జరుగుతుండగా వైమానిక దాడి జరిగింది.
దీంతో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా పదుల సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
అయితే దాడులకు పాల్పడిన వారి వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా, వివాహ వేడుక షీటె హౌతీ గ్రూప్ మద్దతుదారిడి ఇంట్లో జరుగుతున్న నేపథ్యంలోనే వైమానిక దాడి జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
పోలీస్ వాహనంలో బాంబు పేలుడు
ఈజిప్టు రాజధాని కైరో నగరంలోని పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో పోలీసు కూడా ఉన్నాడని చెప్పారు. నగరంలోని అత్యంత జనసమర్థంగా ఉండే ప్రాంతం అజబాకియా పోలీస్ స్టేషన్ ఒకటి.
అయితే గత రాత్రి స్టేషన్ లో పోలీస్ వాహనాలు నిలిపి ఉంచే ప్రాంతంలో ఓ వాహనానికి తీవ్రవాదులు బాంబు అమర్చారని ఉన్నతాధికారి తెలిపారు. దీంతో పోలీసు స్టేషన్ వద్ద పేలుడు సంభవించిందన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే పోలీస్ స్టేషన్లో తీవ్రవాదులు మరిన్ని బాంబులు అమర్చి ఉంటారని.. వాటి కోసం శోధిస్తున్నట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.