స్మగర్ల అరాచకం: సముద్రంలోకి 300మంది తోసివేత, 56మంది మృతి
సముద్రం గుండా మనుషుల అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లు మరో దారుణానికి తెగబడ్డారు.
దుబాయ్: సముద్రం గుండా మనుషుల అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్ల దురాగతాలు పెచ్చుమీరుతున్నాయి. యెమన్కు చెందిన 2 పడవల్లోని 300 మంది వలసదారులను సముద్రంలోకి తోసివేయడంతో వారిలో 56 మంది మృతి చెందారు. మరో 35 మంది గల్లంతయ్యారు.
ఏదో విధంగా ప్రాణాలతో బయటపడిన ఇథియోపియా, సోమాలియా వలసదారులు యెమన్ తీరం ద్వారా షబ్వాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన వలస వ్యవహారాల సంస్థ (ఐఓఎం) తెలిపింది. యెమన్లో యుద్ధం అనంతరం 8,300 మంది చనిపోగా.. 2015 నుంచీ లక్షలాది ప్రజలు వేరే ప్రాంతాలకు వలసవెళ్లారు.

ఈ క్రమంలో మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్న యెమెన్ ఆఫ్రికా నుంచి వలసదారులను రప్పించుకుంటోంది. దీంతో అరేబియా సముద్రంలో మనుషులను అక్రమంగా తరలించే కార్యకలాపాలు పెరిగిపోయాయి. తమను అధికారులెవరైనా అరెస్టు చేస్తారన్న భయంతో స్మగ్లర్లు.. పలుమార్లు వలసదారులను సముద్రంలోకి తోసేస్తున్నారు. తాజాగా, జరిగిన ఘటనలో 56మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
కాగా, అరేబియా సముద్రంలోకి గురువారం 180 మంది, బుధవారం 120 మంది వలసదారులను స్మగ్లర్లు తోసివేసినట్లు ఐఓఎం తెలిపింది. రెడ్క్రాస్ అంతర్జాతీయ కమిటీతో కలిసి పనిచేస్తున్న ఐఓఎం బృందాలు ఇంతవరకు షబ్వా తీరంలో 29 మృతదేహాలను కనుగొన్నాయి. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపాయి.












Click it and Unblock the Notifications