కవ్వింపులు మనకు- హెచ్చరికలు ఇంకెవరికో - సరిహద్దుల్లో చైనా దాడుల వ్యూహమిదే...
భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటి వెనుక కారణాలను వెతికే పనిలో చాలా దేశాలు నిమగ్నమయ్యాయి. చాలా కాలం తర్వాత భారత్ లక్ష్యంగా సరిహద్దుల్లో చైనా ఉద్రిక్తతలకు తెరలేపడం, ఏకంగా 20 మందికి పైగా భారత సైనికులను పొట్టనబెట్టుకోవడం వెనుక భారీ వ్యూహమే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం దృష్టి మళ్లించేందుకే చైనా ఈ ఉద్రిక్తతలకు తెరలేపిందని భావించినా కవ్వింపులతో అగ్రదేశాలకు హెచ్చరికలు పంపడానికే అన్న వాదన కూడా వినిపిస్తోంది.

చైనా కవ్వింపులు, దాడుల వెనుక...
భారత సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద నున్న వ్యూహాత్మక ప్రాంతం గల్వాన్ లోయలో చైనా సైనికులు విరుచుపడి మన బలగాలను పొట్టనబెట్టుకోవడం, ఆ తర్వాత కూడా చోటు చేసుకుంటున్న కవ్వింపులు ప్రపంచదేశాలను ఆలోచనలో పడేస్తున్నాయి. అదే సమయంలో భారత్ పొరుగుదేశాలైన నేపాల్, భూటాన్, పాకిస్తాన్ ను కూడా రెచ్చగొట్టేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తనతో సమానం కాకపోయినా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ పై చైనా ఇంత అర్జెంటుగా దాడులు, కవ్వుంపులకు పాల్పడటం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది.

బహుముఖ వ్యూహం...
భారత్ సరిహద్దుల్లో చైనా కవ్వింపుల వెనుక చాలా కారణాలే ఉన్నట్లు అర్ధమవుతోంది. వాస్తవానికి ముందు భావించినట్లుగా కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమన్న విమర్శల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు చైనా ఈ దాడులకు పాల్పడిందని ఇప్పటికీ చాలా దేశాలు భావిస్తున్నాయి. అయితే అదే సమయంలో భారత్ తో పాటు నేపాల్, భూటాన్, పాకిస్తాన్ వంటి దేశాలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవడం ద్వారా అగ్రదేశాలకు తన సత్తా చాటాలన్న వ్యూహం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లేకుంటే గతంలో ఎన్నడూ లేనంతగా భారత్ పై ఇంత అనూహ్యంగా చైనా దాడులకు అవకాశం లేదంటున్నారు.

కవ్వింపులు మనకు, హెచ్చరికలు ఎవరికో..
గతంతో పోలిస్తే చైనా రక్షణ పరంగా ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. రక్షణ రంగంలో తాను అభివృద్ధి చెందిన విషయాన్ని, తన సత్తాను చాటుకోవాలంటే దాన్ని చూపించుకోవాల్సిన సందర్భం కూడా రావాలి. అందుకే భారత్ గనుక దాడికి దిగితే తన సత్తా చూపించాలని, తద్వారా అగ్ర రాజ్యాలకు సైతం హెచ్చరికలు పంపవచ్చని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన పలువురు నిపుణులు ఇదే అంశాన్ని తాజాగా అంతర్జాతీయ మీడియాతో పంచుకున్నారు. అంటే భారత్ ను కవ్వించడం ద్వారా దాడులకు పురిగొల్పి తద్వారా అగ్రరాజ్యాలకు హెచ్చరికలు పంపడమే చైనా తాజా వ్యూహమని అర్ధమవుతోంది.
Recommended Video

సత్తా చూపేందుకు సరైన సమయం...
ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారితో వణికిపోతున్నాయి. పలు అగ్రదేశాల ఆర్దిక వ్యవస్దలు కూడా పతనమయ్యాయి. ఇప్పుడు యుద్ధం వస్తే ఎదుర్కొనేందుకు ఏ ఒక్క దేశం కూడా సంసిద్దంగా లేదు. ఇలాంటి సమయంలో బల ప్రదర్శనలు చేయడం ద్వారా ఎలాంటి విపత్తునైనా తట్టుకుని రక్షణ పరంగా నిలదొక్కుకునేందుకు తాము సిద్దంగా ఉన్న సంకేతాలను ప్రపంచ దేశాలకు పంపేందుకే చైనా ఇలాంటి దందుడుకు చర్యలకు దిగుతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. కరోనా వేళ ఆర్ధిక వ్యవస్ధలు కుదేలైనా తమ దేశం మాత్రం ఆర్ధికంగా, రక్షణ పరంగా బలంగా ఉందన్న సంకేతాలను ప్రపంచానికి పంపడమే దాని ఉద్దేశం.












Click it and Unblock the Notifications