Baba Vanga జోస్యం: 2022లో భారత్లో కరువు.. ప్రాణాలు తీసే సునామీలు భూకంపాలు ఇంకా చాలా..!!
బాబా వంగా... ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ... అవును కచ్చితంగా వినే ఉంటారు. మన తెలుగు వారైన వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలాగైతే కాలజ్ఞానం చెప్పారో... అలాగే బల్గేరియాకు చెందిన ఈ బాబా వంగా కూడా కాలజ్ఞానం చెప్పారు. అంతేకాద భవిష్యత్తులో ఏమైతే జరుగుతాయని చెప్పిందో అవన్నీ దాదాపు జరిగాయి. తాజాగా 2022 గురించి బాబా వంగా చెప్పిన విషయాలు కొన్ని చూద్దాం.. అవి నిజమవుతాయా లేదా అని తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు మరి.
భవిష్యత్తు అంచనా
బాబా వంగా... బల్గేరియాకు చెందిన ఈ మహిళకు చూపులేదు. తాను 12 ఏళ్ల వయసులో ఉన్న సమయంలోనే చూపును కోల్పోయింది. ఆ సమయంలోనే బాబా వంగా ఓ మాట చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునే దూరదృష్టిని తనకు భగవంతుడు ప్రసాదించాడని చెప్పుకొచ్చింది. బాబా వంగా అసలు పేరు వంగేలియా గుష్టెరోవా... కానీ కాలక్రమంలో ఆమె బాబా వంగాగానే ప్రాచుర్యం పొందారు. బాబా వంగా 1996లో స్వర్గస్తులయ్యారు. అప్పుడెప్పుడో మరణిస్తే 2022 గురించి భవిష్యవాణి చెప్పడమేంటని చాలమందికి సందేహాలు రావొచ్చు.. కానీ ఆమె జీవించి ఉన్న సమయంలోనే ప్రపంచం అంతమయ్యే వరకు ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందనేది చెప్పేసింది.
యుగాంతం ఎప్పుడంటే
యుగాంతం 5079లో జరుగుతుందని బాబా వంగా భవిష్యవాణిని వినిపించింది. ఆమె గతంలో చెప్పిన పలు అంశాలు కూడా నిజమయ్యాయి. ఇందులో సోవియట్ యూనియన్ అనేది ఇక ఉండదని, ప్రిన్సెస్ డయానా మరణం, 2004లో థాయ్లాండ్ను సునామీ అతలాకుతలం చేస్తుందని, అమెరికా అధ్యక్షుడిగా నల్ల జాతీయుడైన బరాక్ ఒబామా అవుతారని, 9/11 దాడులు, బ్రెగ్జిట్ గురించి ఇలా పలు అంశాలను బాబా వంగా ముందుగానే అంచనా వేశారు. ఆ అంచనాలు నిజమయ్యాయి.
2022లో ఏం జరగబోతోంది..?
మరి కొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రపంచ దేశాలు సైతం నూతన సంవత్సరంలో కొత్త ఆశతో అడుగుపెట్టాలని భావిస్తున్నాయి. కానీ అది సాధ్యమవుతుందా.. బాబా వంగా 2022 ఎలా ఉండబోతోందని అంచనా వేశారు.. ? 2022లో భారత్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ ను తాకుతాయని పేర్కొంది. దీంతో పొలాలపై మిడతలు దాడి చేస్తాయని, పంటను ధ్వంసం చేసి అపారనష్టాన్ని మిగులుస్తాయని ఆమె అంచనా వేశారు. అంతేకాదు కరువు కూడా ఏర్పడే అవకాశాలున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద నగరాల్లోని కొన్నటికి తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని బాబా వంగా ప్రెడిక్ట్ చేశారు. అంతేకాదు నీటి ఎద్దడి ఏర్పడటానికి కారణం నదులు కాలుష్యం కావడమేనని చెప్పారు. ఇది దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తుందని చెప్పారు. ఇక అధిక వరదలతో పలు ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియా దేశానికి కూడా అపార నష్టం కలుగుతుందని జోస్యం చెప్పారు. ఇక భూకంపాలు, సునామీలు పలు దేశాల్లో బీభత్సం సృష్టిస్తాయని కొన్ని వందల మందిని బలితీసుకుంటాయని చెప్పుకొచ్చింది.
వైరస్ల దాడి
ఇప్పటికే కరోనావైరస్ ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. దీనికి తోడు మరో వైరస్ కబళించేందుకు సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు బాబా వంగా. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైందంటూ చెప్పుకొచ్చిన బాబా వంగా... దీన్ని స్వీడెన్కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొంటారని పలు పరిశోధనలు చేస్తారంటూ జోస్యం చెప్పింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగే హిమనీనదాలు లేదా మంచు పర్వతాల నుంచి ఈ వైరస్ పుట్టుకొస్తుందని చెప్పారు. ఇక 2022లో ప్రపంచమంతా వర్చువల్ రియాల్టీ స్టేజ్లోకి వెళ్లిపోతుందని... ప్రజలు మునుపెన్నడూ గడపనంత సమయం స్క్రీన్స్ ముందు గడుపుతారని భవిష్యత్తు చెప్పింది బాబా వంగా. ఇక భూమిపై జీవనం ఏర్పాటు చేసుకునేందుకు గ్రహాంతర వాసులు ఓ ఉల్కను పంపుతారని అది కూడా 2022లో జరుగుతుందని బాబా వంగా జోస్యం చెప్పింది.