డ్రగ్స్కు బలైన యువజంట.. తిండిలేక చిన్నారి మృతి
హెరాయిన్ ను అధిక మొత్తంలో తీసుకోవడంతో కొద్ది నిముషాల తేడాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
పెన్సిల్వేనియా: మత్తుపదార్థం హెరాయిన్ ను అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఓ యువ జంట ప్రాణాలు విడిచింది. మరింత విషాదకరం ఏంటంటే.. వీరి మరణంతో దిక్కులేనిదైన ఐదు నెలల వీరి కూతురు కూడా నాలుగురోజుల పాటు ఆకలితో అలమటించి అదే ఇంట్లో చనిపోయింది. డ్రగ్స్ వల్ల మొత్తం మూడు నిండు ప్రాణాలు బలైపోగా.. వీరు ముగ్గురు మరణించిన వారానికి గానీ విషయం వెలుగుచూడలేదు.
వివరాల్లోకి వెళ్తే.. పెన్సిల్వేనియాలోని జాన్స్ టౌన్ సమీపంలో నివాసముండే జాసన్ చాంబర్స్(27), చెల్సియా కార్డారో(19) డ్రగ్స్ కు తీసుకునే అలవాటుంది. ఇదే క్రమంలో హెరాయిన్ ను అధిక మొత్తంలో తీసుకోవడంతో కొద్ది నిముషాల తేడాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరు మరణించి దాదాపు వారం గడిచినట్టుగా పోలీసులు గుర్తించారు.
కాగా, చాబర్స్ ఆ ఇంట్లోని మొదటి అంతస్తులో చనిపోయి ఉండగా.. కార్డారో రెండో అంతస్తులోని బాత్రూంలో పడి ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. చిన్నారి మృతదేహం రెండో ఫ్లోర్ లోని బెడ్ రూమ్ లో లభ్యమైనట్టు పేర్కొన్నారు. ఈ దంపతులు కొన్నాళ్ల క్రితమే న్యూయార్క్ నుంచి పెన్సిల్వేనియాకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే, డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాల సంఖ్య ఇటీవలి కాలంలో అమెరికాలో విపరీతంగా పెరిగింది. నార్త్ కరోలినా, ఓహియో, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో డ్రగ్స్ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలు 2014,2015లో ఎక్కువగా నమోదయ్యాయి.