మిరాకిల్ : ఒకే శిశువును రెండుసార్లు ప్రసవించిన తల్లి
న్యూయార్క్ : వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. ఒకవిధంగా.. ఒకే శిశువును తల్లి రెండుసార్లు ప్రసవించింది. ఈ అరుదైన ఘటన అమెరికాలోని టెక్సాస్ లో జరగ్గా.. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మార్గరెట్ బోమెర్ అనే గర్భిణీ 16 వారాల గర్భిణిగా ఉన్న సమయంలో.. వైద్య పరీక్షల కోసం టెక్సాస్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం కడుపులో పెరుగుతున్న శిశువుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు నిర్దారించారు వైద్యులు. శువు వెన్నెముకకు కణితి పెరుగుతున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో.. తక్షణం దాన్ని తొలగించాల్సిందిగా సూచించారు.
కణితి పరిణామం రోజురోజుకు పెద్దదవుతూ ఉండడం.. శిశువు ప్రాణానికే ప్రమాదంగా మారింది. అలా మార్గరెట్ 23వారాల గర్భిణీగా ఉన్న సమయంలో.. శిశువు పరిణామం కన్నా కణితి పరిణామం పెద్దదిగా మారింది. శస్త్ర చికిత్స చేసి దాన్ని తొలగించకపోతే శిశువుకు ప్రాణపాయం అని వైద్యులు చెప్పడంతో.. తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు.
అలా శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీసి.. కణితిని తొలగించిన అనంతరం.. సురక్షితంగా మళ్లీ తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టి గర్భసంచికి కుట్లువేశారు. ఇదంతా జరిగిన మరో 12వారాల తర్వాత సిజేరియన్ ద్వారా పండంటి పాపను ప్రసవించింది మార్గరెట్. పుట్టిన బిడ్డకు లైన్లీ హోప్ అని పేరు పెట్టగా.. ఈ ఘటన వైద్య చరిత్రలోనే అరుదైనదిగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.