భారతీయుల వర్క్ పర్మిట్ల రద్దు? బంగ్లా సర్కార్ కు అల్టిమేటం..!
బంగ్లాదేశ్ లో విద్యార్ది నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత భారత్ పై విద్వేషం అంతకంతకూ పెరుగుతోంది. భారత్ తో సంబంధం ఉన్న వారే ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇప్పటికే అక్కడ హిందువులపై మూకదాడులు, హత్యలు జరుగుతున్నాయి. అలాగే హాదీని చంపిన హంతకులు భారత్ లోకి పారిపోయి తలదాచుకున్నారంటూ బంగ్లా పోలీసులు ఆరోపించగా.. కేంద్రం ఆ ఆరోపణల్ని తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో భారత్ పై విద్వేషం వెళ్లగక్కేలా అక్కడి విద్యార్ది నేతలు మరో డిమాండ్ తెరపైకి తెచ్చారు.
బంగ్లాదేశ్ లో భారతీయుల వర్క్ పర్మిట్లన్నీ 24 గంటల్లో రద్దు చేసి వారిని వెనక్కి పంపాలని ఉస్మాన్ హాదీ పార్టీ ఇంకిలాబ్ మోంచో ఇవాళ అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. దీంతో పాటు ప్రభుత్వానికి నాలుగు ప్రధాన డిమాండ్లు చేసింది.
తమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై 24 రోజుల్లోపు విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తాజాగా ఢాకాలోని షాబాగ్ నుండి ఇంకిలాబ్ మోంచో సభ్య కార్యదర్శి అబ్దుల్లా అల్ జాబర్ ఈ అల్టిమేటం ప్రకటించారు.

ఉస్మాన్ హాదీ హంతకుడు, సూత్రధారి, సహచరులు, వారి తప్పించుకోవడానికి సహాయం చేసినవారు, వారికి ఆశ్రయం కల్పించిన వారితో సహా మొత్తం హత్యా దళంపై విచారణను రాబోయే 24 రోజుల్లోపు పూర్తి చేయాలంటూ ఫేస్ బుక్ లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు హాది హంతకులను తదుపరి 24 గంటల్లోగా తిరిగి ఇవ్వకపోతే/భారతదేశంలో వారి బస గురించి నిర్దిష్ట ప్రకటన రాకపోతే, భారతీయుల పని అనుమతులను రద్దు చేయాలని కోరింది. భారతదేశం తమ వద్ద ఆశ్రయం పొందిన హంతకులను తిరిగి పంపేందుకు నిరాకరిస్తే, వారిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు నమోదు చేయాలని కూడా కోరింది. సివిల్ మిలిటరీ ఇంటెలిజెన్స్లో దాక్కున్న ఫాసిస్ట్ నేరస్థులను గుర్తించి, అరెస్టు చేసి, న్యాయం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications