బస్సుపైకి పెట్రోల్ బాంబు విసిరిన నిరసనకారులు: ఏడుగురు సజీవ దహనం
ఢాకా: బంగ్లాదేశ్లో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. దీనిలో భాగంగా ఢాకా నుంచి కోక్స్ బజార్ వైపు వస్తున్న బస్సుపై ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొందరు నిరసనకారులు పెట్రోల్ బాంబు విసిరారు.
దీంతో బస్సుకు మంటలు అంటుకోగా, అందులో నిద్రిస్తున్న ఏడుగురు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరిలించారు.

ఆసుపత్రికి తరలించిన వారిలో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు జిల్లా పోలీసు చీఫ్ టుట్టుల్ ఛక్రభర్తీ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వీరి శరీరాలు 80 శాతం పూర్తిగా కాలిపోయినట్లు చెప్పారు. ఈ ఘటన వెనుక విపక్ష నేత ఖలీదా జియాకు పార్టీకి చెందిన నిరసన కారులు హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రెహ్మాన్ వెల్లడించారు.
ఘటన జరిగిన సమీపంలోని గ్రామాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. కాగా, ఈఘటనకు, నిరసనకారులకూ ఎలాంటి సంబంధం లేదని విపక్ష నేత ఖలీదా జియా తెలిపారు.












Click it and Unblock the Notifications