బంగ్లాలో ఆగని రక్తపాతం.. మరో హిందూ యువకుడి ప్రాణం బలి!
బంగ్లాదేశ్లో అరాచక శక్తుల హింసకు అడ్డుకట్ట పడటం లేదు. హిందువులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితమే దీపు చంద్ర అనే హిందూ వ్యక్తిని హత్య చేసిన ఘటన మరవకముందే.. తాజాగా రాజ్బారి జిల్లాలో మరో హిందూ యువకుడిని గుంపుగా చేరి కొట్టి చంపిన ఉదంతం కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
స్థానిక నివేదికల ప్రకారం.. రాజ్బారి జిల్లా పాంగ్షా ప్రాంతంలో అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్(30) అనే యువకుడిని గ్రామస్థుల గుంపు కొట్టి చంపింది. అమృత్ మండల్ హుస్సేన్దంగాకు చెందిన అక్షయ్ మండల్ కుమారుడు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. అమృత్ మండల్ ఒక నేర ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అమృత్ తన సహచరులతో కలిసి స్థానిక నివాసి షాహిదుల్ ఇస్లాం ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేశాడని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు 'దొంగ దొంగ' అని కేకలు వేయడంతో గ్రామస్థులు గుమిగూడి దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన అమృత్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

పాంగ్షా సర్కిల్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ దేవబ్రత సర్కార్ మాట్లాడుతూ.. మృతుడిపై గతంలో హత్య సహా పలు కేసులు ఉన్నాయని తెలిపారు. కొంతకాలం భారత్లో తలదాచుకున్న అమృత్ ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చినట్లు సమాచారం. ఈ దాడిలో అతడి సహచరుడు మహమ్మద్ సలీమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఒక పిస్టల్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
కొనసాగుతున్న ఉద్రిక్తతలు:
బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే ఆందోళనల మధ్య ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితం మయమన్సింగ్ జిల్లాలో దీపు చంద్ర అనే హిందూ వ్యక్తిని గుంపుగా చేరి కొట్టి చంపి, ఆపై శవాన్ని తగలబెట్టిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఈ దాడులను ఖండించినప్పటికీ, క్షేత్రస్థాయిలో హింస తగ్గకపోవడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పోలీసులు దీనిని నేరపూరిత కోణంలో చూస్తున్నప్పటికీ.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న వరుస దాడులు అక్కడి మైనారిటీలలో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి మాబ్ లించింగ్ దాడులు నాగరిక సమాజానికి గొడ్డలిపెట్టు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications