ట్రంప్ కు బిగ్ షాక్ : హిల్లరీకి బుష్ కుటుంబం నుంచి ఊహించని మద్దతు
అమెరికా : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రిపబ్లిక్ పార్టీకే చెందిన బార్బారా పియర్స్ బుష్ (గ్రాండ్ ఓల్డ్ పార్టీ) నుంచి డెమెక్రాట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు మద్దతు లభించింది. కాగా సదరు వ్యక్తి రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికాకు ఇద్దరు అధ్యక్షులను అందించిన బుష్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం.
అమెరికన్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఈ పరిణామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ లోని పారిస్ లో హిల్లరీ సహాయకురాలు హుమా అబెదిన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమానికి బార్బారా పియర్స్ బుష్ (అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కుమార్తె) హాజరవడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే తరాల నుంచి బార్బారా కుటుంబం రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ వస్తుండగా.. ఆ సాంప్రదాయానికి విరుద్దంగా బార్బారా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరిని ఆలోచింపజేస్తోన్న అంశం. ఈ పరిణామంతో హిల్లరీ క్లింటన్ కు ఊహించని విధంగా ప్రత్యర్థి పార్టీ నుంచి మద్దతు లభించినట్టయింది. ఇప్పటికే తొలి అధ్యక్ష డిబేట్ లో హిల్లరీ క్లింటన్ చేతిలో ఘోరంగా విఫలమైన ట్రంప్ కు ఇది ఇబ్బందికర పరిణామమే. తాజా పరిణామం బుష్ కుటుంబం మొత్తం హిల్లరీ వెనుకే ఉందన్న సంకేతాలను అమెరికన్స్ లోకి పంపిస్తోంది.
కాగా, బార్బారా తాత సీనియర్ బుష్ ట్రంప్ కు వ్యతిరేకంగా గళమెత్తిన సంగతి తెలిసిందే.అప్పట్లో ట్రంప్ కు వ్యతిరేకంగా తన కుమారుడు జెబ్ బుష్ పోటీ పడ్డారు. ట్రంప్ ధాటికి తాళలేని జెబ్ బుష్ అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో రిపబ్లికన్ పార్టీకి చెంది ఉండి డెమోక్రట్లకు మద్దతు పలుకుతున్నారంటూ బుష్ కుటుంబంపై ఆరోపణలు వస్తుండగా బుష్ కుటుంబం మద్దతులేకున్నా అధ్యక్షుడు తానేనని ట్రంప్ పేర్కొంటుండడం గమనార్హం.