భారత్ బయోటెక్ అనూహ్య నిర్ణయం-బ్రెజిల్తో వ్యాక్సిన్ సప్లై ఒప్పందం రద్దు-కారణమిదే...
కోవాగ్జిన్ వ్యాక్సిన్ అభివృద్ది చేసిన భారత్ బయోటెక్ సంస్థ బ్రెజిల్ ఫార్మా కంపెనీలతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కోవాగ్జిన్ సప్లై కోసం జరిగిన 324 మిలియన్ డాలర్ల ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో డీల్ నుంచి భారత్ బయోటెక్ తప్పుకుంది. దీంతో బ్రెజిల్కు సప్లై చేయాల్సిన 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్ డ్రగ్కు బ్రేక్ పడినట్లయింది.
Recommended Video
బ్రెజిల్కు చెందిన ప్రెసికా మెడికమెంటోస్,ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ కంపెనీలతో భారత్ బయోటెక్ గతేడాది నవంబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందంలో బ్రెజిల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్రెజిల్లో 'కోవాగ్జిన్ గేట్'గా వ్యవహరిస్తున్న ఈ వివాదంపై బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ దర్యాప్తు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
మొదట బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి రికార్డో మిరందా చేసిన వ్యాఖ్యలతో ఈ అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి సందేహాస్పదమైన ఇన్వాయిస్ను క్లియర్ చేయాల్సిందిగా తనపై పైనుంచి ఒత్తిడి తీసుకొచ్చారని మిరందా ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ జోక్యం చేసుకున్నారు.మరోవైపు బ్రెజిల్ సెనేట్ ప్యానెల్ కూడా దీనిపై విచారణ జరుపుతోంది.
భారత్ బయోటెక్ మాత్రం అన్ని ఆరోపణలను తోసిపుచ్చింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం కోసం (EUA) తాము ప్రతీ స్టెప్ను ఫాలో అయ్యామని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆయా దేశాల్లోని చట్టాలకు లోబడే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది.విలువలు,సమగ్రత విషయంలో తమ సంస్థ అత్యున్నత ప్రమాణాలకు పెద్ద పీట వేస్తుందని పేర్కొంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు ఉంది. బ్రెజిల్కు 15 డాలర్ల చొప్పున విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే ఇందుకోసం ఎలాంటి అడ్వాన్స్ ప్రభుత్వం నుంచి తీసుకోలేదని తెలిపింది. ఇప్పటివరకూ బ్రెజిల్కు వ్యాక్సిన్లు సప్లై చేయలేదని స్పష్టం చేసింది. అటు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించారు. ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు.