తేల్చేసిన భూటాన్: రంకెలు.. బొంకుల డ్రాగన్.. డోక్లాంపై ఇదీ చైనా నైజం
డోక్లాం ముక్కోణ జంక్షన్ తమదేనని, భారత్ తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిందని డ్రాగన్ సవాల్ విసిరింది.భూటాన్ కూడా ఈ భూభాగం చైనాదేనని తేల్చేసిందని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది.
న్యూఢిల్లీ: అబద్దాలు చెప్పడంలోనూ, బుకాయించడంలోనూ చైనా తర్వాతే ఎవరైనా అంటే అతిశేయోక్తి కాదు మరి. ఎందుకంటే ఇప్పటి వరకు డోక్లాం ముక్కోణ జంక్షన్ తమదేనని, భారత్ ఏకపక్షంగా తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిందని హెచ్చరికలతో కూడిన సవాళ్లు విసిరిన డ్రాగన్.. భూటాన్ కూడా ఈ భూభాగం చైనాదేనని తేల్చేసిందని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది.
పొరుగుదేశాల భూభాగాలు, జలాల్లోకి చొచ్చుకెళ్లే తన విస్తరణవాదానికి భారత్ సవాల్ రువ్వేసరికి చైనా గంగవెర్రిలెత్తిపోతోంది. డోక్లాంలోని భూటాన్ భూభాగంలో రోడ్డు వేసేందుకు తాను చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకోవడంతో 50 రోజులుగా అవాకులు చెవాకులు పేలుతోంది. ముఖ్యంగా ఆ దేశ అధికారిక మీడియా.. యుద్ధం తప్పదంటూ భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ రంకెలకు భారత్ రవ్వంత కూడా అదరకపోవడంతో చివరికి బొంకులకూ వెరవలేదు.
భారత్, చైనా మధ్య సైనిక ప్రతిష్టంభనకు కారణమైన డోక్లాం తమ భూభాగం కాదని దౌత్యమార్గాల ద్వారా భూటాన్ తమకు తెలియజేసినట్లు చైనా విదేశాంగ శాఖలో సరిహద్దు, సముద్ర వ్యవహారాల విభాగ డైరెక్టర్ జనరల్ వాంగ్ వెన్లి భారత మీడియా బృందానికి మంగళవారం తెలిపారు. కానీ ఈ వాదనకు మద్దతుగా ఎలాంటి ఆధారాలను ఆమె ఇవ్వలేదు. దీన్ని భూటాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
Recommended Video
''డోక్లాంలో సరిహద్దు అంశంపై మా వైఖరి విస్పష్టం. జూన్ 29న మా విదేశాంగ శాఖ వెబ్సైట్లో ప్రచురితమైన మా అధికారిక ప్రకటనను ఒకసారి చూడండి'' అని భూటాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మా భూభాగంలో రోడ్డు నిర్మించడం.. రెండు దేశాల మధ్య సరిహద్దు నిర్వచన ప్రక్రియను, ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని ఆ ప్రకటనలో భూటాన్ పేర్కొంది. జోంపెల్రిలోని తమ సైనిక శిబిరానికి దారితీసే విధంగా ఈ రోడ్డు నిర్మాణం ఉందని అందులో తెలిపింది.
కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలి
సిక్కిం ప్రాంతంలో కొత్తగా సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సెంటర్ ఆన్ చైనా-అమెరికా డిఫెన్స్ రిలేషన్స్ సంస్థ డైరెక్టర్ ఝావో జియావోజౌ తెలిపారు. తద్వారా అది మరింత సమకాలీనంగా ఉంటుందని తెలిపారు. 1890లో బ్రిటన్-చైనాల నడుమ కుదిరిన ఒప్పందం స్థానంలో ఇది అవసరమని బీజింగ్ లో భారత్ మీడియా మీడియా బృందంతో ఆయన అన్నారు. నాడు 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా' లేదని, భారత్ కూడా బ్రిటన్ పాలనలో ఉందని చెప్పారు. ''భారత్-చైనా సరిహద్దుల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ విభాగాల్లో ప్రాదేశిక వివాదాలు ఉన్నందువల్ల ఇది అవసరం. సిక్కిం ప్రాంతంలోనే మనకు నిర్దిష్ట సరిహద్దు ఉంది. అందువల్ల సాధ్యమైనంత త్వరగా కొత్త ఒప్పందం అవసరం'' అని సెంటర్ ఆన్ చైనా-అమెరికా డిఫెన్స్ రిలేషన్స్ సంస్థ డైరెక్టర్ ఝావో జియావోజౌ తెలిపారు.
రాజీ ఉండదు
డోక్లాం ప్రతిష్టంభనకు ముగింపు పలికే విషయంలో చైనా ఎలాంటి రాజీకి దిగబోదని ఝావో చెప్పారు. చైనా భూభాగంలోకి బలగాలను పంపడం ద్వారా చైనా విషయంలో భారత్ తప్పుడు నిర్ణయాన్ని తీసుకుందన్నారు. ప్రమాదకరమైన ఈ నిర్ణయం పట్ల చైనా ప్రభుత్వం, ప్రజలు, సైన్యం ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. భారత చర్యకు సంబంధించి ఇప్పటివరకూ తాము 'దురాక్రమణ' అనే పదాన్ని ఉపయోగించలేదని 'చొరబాటు' వంటి పదాలనే ఉపయోగించామని తెలిపారు. ఇది చైనా సుహృద్భావ చర్య అని పేర్కొన్నారు. రెండు దేశాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ బేషరతుగా వైదొలగాలని కోరారు. భారత బలగాలను భూటాన్ ఆహ్వానించలేదన్నారు. పాకిస్థాన్ తరఫున తాము భారత సరిహద్దులను దాటి లోపలికి వస్తే ఏం చేస్తారని భారత మీడియా బృందాన్ని ప్రశ్నించారు.
డోక్లాంలో చైనా దుందుడుకు చర్యలు
భారత్-చైనా నడుమ నెలకొన్న ప్రతిష్టంభనపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలను చేపడుతోందని, ఫలితంగా రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్నారు. ఇటీవల తాను భారత్లో పర్యటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యాయని తెలిపారు. ఆ సందర్భంగా పలు అంశాలపై చర్చించామని, డోక్లాం వ్యవహారం చర్చకు రాలేదన్నారు. ఈ ప్రతిష్టంభనపై దౌత్య మార్గంలో శాంతియుత పరిష్కార మార్గాన్ని కనుగొనాలని సూచించారు. మరోవైపు అమెరికాకు చెందిన వ్యూహకర్తలు కూడా చైనా వైఖరిపై మండిపడుతున్నారు. డోక్లాంలో రోడ్డు నిర్మాణానికి చైనాకు అనుమతిస్తే భారత్కు ఇబ్బందులు ఎదురవుతాయని విల్ ఎడ్వర్డ్స్ అనే విశ్లేషకుడు పేర్కొన్నారు.
వేడి రాజుకుంటున్న డోక్లాం
డోక్లాంలో వేడి రాజుకుంటున్నట్టు తెలుస్తున్నది. గత 50 రోజులకు పైగా భారత్, చైనా బలగాలు డోక్లాంలో మోహరించడంతో నెలకొన్న ప్రతిష్టంభన ఘర్షణ దిశగా సాగుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు తెలుపుతున్నాయి. 33వ కార్ప్కు చెందిన వేల మంది భారత సైనికులు సుక్నా నుంచి డోక్లాం వైపు కదులుతున్నారు. సరిహద్దుకు సమీపంలోని గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని సైన్యం ప్రజలను కోరింది. డోక్లాంకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నతాంగ్ గ్రామ వాసులను సైన్యం వేరే ప్రాంతాలకు తరలిస్తున్నది.
డోక్లాం వైపు వస్తున్న 33వ కార్ప్కు చెందిన సైనికులకు నతాంగ్లో ఆశ్రయం కల్పించేందుకు గ్రామస్తులను తరలిస్తున్నారా లేక ఏదైనా ఘర్షణ జరిగితే పౌరులకు హాని కలుగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. నతాంగ్ జనాభా వందల సంఖ్యలోనే ఉంది. సైనిక బలగాల తరలింపుపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రతి సెప్టెంబర్లో ఇక్కడ సైనిక విన్యాసాలు నిర్వహిస్తామని, ఈ ఏడాది ఒక నెల ముందుగా చేపట్టనున్నామని కొంతమంది సీనియర్ సైన్యాధికారులు చెప్పారు. భారత సైన్యం యుద్ధం లేదు, శాంతి లేదు అన్న స్థితిలో ఉన్నదని ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ కొన్ని వార్తలు వెలువడ్డాయి. అనగా మిలిటరీ పరిభాషలో, సైన్యం శత్రువుతో ఘర్షణ పడేందుకు సిద్ధంగా ఉందని అర్థం.