అధ్యక్ష పదవి చేపట్టిన తొలిరోజే కోవిడ్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తా- జో బిడెన్ ధీమా
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు తుది దశ ప్రచారంలో పాల్గొన్న డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ అధికారంలోకి రావడంపై ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తన గెలుపును ఘోషిస్తున్న నేపథ్యంలో బిడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే కోవిడ్ 19 మహమ్మారితో అల్లాడుతున్న అమెరికన్లకు ఊరటనిచ్చాయి.
Recommended Video
తాను అధికారంలోకి రాగానే తొలిరోజే కోవిడ్ 19 యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తానని డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ వెల్లడించారు. ఫిలడెల్ఫియాలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిడెన్ .. ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఎదురుదాడి కొనసాగించారు. గత 90 ఏళ్లలో ఏ అమెరికా అధ్యక్షుడూ చేయని విధంగా తాను అధికారంలోకి వచ్చిన రోజు ఉన్న ఉద్యోగాల కంటే తక్కువ ఉద్యోగాలతో ట్రంప్ అధికారం కోల్పోతున్నారని బిడెన్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ ప్రభుత్వ హయాంలో కరోనా కారణంగా 2.3 లక్షల మంది అమెరికన్లు చనిపోయారని, 9.2 లక్షల మంది వైరస్ బారిన పడ్డారని బిడెన్ తెలిపారు. మాస్క్ను వెక్కిరించకుండా పెట్టుకుని ఉండే అధ్యక్షుడు ఉండి ఉంటే ఇలాంటి పరిస్ధితి వచ్చేది కాదన్నారు.
తాను అధికారంలోకి వచ్చాక కోవిడ్పై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చానని, కానీ పదవి చేపట్టిన తొలిరోజే యాక్షన్ ప్లాన్ విడుదల చేస్తానని బిడెన్ తెలిపారు. మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, పరీక్షలు నిర్వహించడం, వైరస్ గుర్తింపు, పారదర్శకంగా వ్యాక్సిన్ పంపిణీ వంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయని బిడెన్ హామీ ఇచ్చారు. ఇప్పటికీ కరోనా కేసులు తగ్గకపోవడంపై బిడెన్ ఆందోళన వ్యక్తంచేశారు. తాజాగా గత శుక్రవారం కూడా లక్ష కేసులతో ఆల్టైమ్ హై రికార్డు నమోదైందని బిడెన్ గుర్తు చేశారు.